టీవీ ఛానళ్లపై సుప్రీం సీరియస్ కామెంట్స్-సమాజంలో చీలికకు కారణం-విద్వేషాన్ని ఆపలేరా ?
దేశవ్యాప్తంగా విద్వేషపూరిత ప్రసంగాల ఘటనలను అరికట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో విద్వేషాన్ని నింపే ప్రసంగాలు తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే టీవీ వార్తల్లో ప్రసారమయ్యే కంటెంట్ పై నియంత్రణ లేకపోవడాన్నీ తప్పుబట్టింది. దేశంలో స్వేచ్ఛాయుత, సమతౌల్యంతో కూడిన మీడియా అవసరమని పేర్కొంది.
ఇవాళ టీవీ ఛానళ్లలో ప్రతీ అంశం టీఆర్పీ ఆధారంగానే ప్రసారమవుతోందని, ఛానళ్లు పరస్పరం పోటీ పడి సమాజంలో విభజనకు కారణమవుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓ టీవీ న్యూస్ యాంకర్ ద్వేషపూరిత ప్రసంగాలను ప్రచారం చేసే విషయంలో భాగస్వామి కాకుండా అప్పటికప్పుడు దాన్ని ఆపే అవకాశం ఉందని తెలిపింది. ప్రింట్ మీడియాలా ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రెస్ కౌన్సిల్ లేదని, అటువంటి సమయాల్లో వాక్ స్వాతంత్రాన్ని ఎంత మూల్యానికి హక్కుగా ఇవ్వొచ్చని ప్రశ్నించింది.

తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో మూత్ర విసర్జన వ్యవహారంలో నిందితుడిగా ఉన్న వ్యక్తి పేరు వెల్లడించడంపైనా సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. అతను ఇంకా నిందితుడు మాత్రమేనని తెలిపింది. అతన్ని కించపరచరాదని పేర్కొంది.
అనేక సార్లు లైవ్ డిబేట్ల సమయంలో యాంకర్లు ప్యానెల్లో కూర్చున్న వ్యక్తి వాయిస్ని మ్యూట్ చేయడం లేదా కౌంటర్ వ్యూను ప్రదర్శించడానికి అనుమతించకపోవడం వల్ల సమస్యలో భాగమయ్యారని సుప్రీంకోర్టు తెలిపింది.
టీవీ ఛానెల్లు ద్వేషపూరిత ప్రసంగాలను ప్రచారం చేయడం ద్వారా ప్రోగ్రామ్ కోడ్ను ఉల్లంఘించినట్లు తేలితే, వాటి నిర్వహణపై చర్యలు తీసుకోవచ్చని జస్టిస్ నాగరత్న అన్నారు.












Click it and Unblock the Notifications