హిజాబ్ వివాదంలో మరో ట్విస్ట్-హైకోర్టు తీర్పుపై కర్నాటక సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు
కర్నాటకలో హిజాబ్ వివాదం ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎంత కలకలం రేపిందో చూశాం. కర్నాటకలో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ సర్కార్ హిజాబ్ నిషేధంపై పట్టుదలకు పోయి జారీ చేసిన ఆదేశాలు.. అనంతరం వాటిని సమర్ధిస్తూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది.
హిజాబ్ పై కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని, అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 23 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో కొన్ని ముస్లిం విద్యార్ధినులకు హిజాబ్ ధరించి విద్యాసంస్ధలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని, మరికొన్ని మార్చి 15న కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు కూడా ఉన్నాయి. వీటిపై సత్వర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును పిటిషనర్లు కోరారు. అయితే ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టడంతో తమకు రెండువారాల గడువివ్వాలని పిటిషనర్లు కోరారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పిటిషనర్లు, లాయర్లు హాజరయ్యే అవకాశం ఉండటంతో వాయిదా కోరారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
కర్నాటక ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పిటిషనర్ల తీరుపై అభ్యంతరం వ్యక్తంచేశారు.

అయితే చివరికి పిటిషనర్ల వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. అదే సమయంలో కర్నాటక ప్రభుత్వం కూడా తన వాదన వినిపించాలని సూచిస్తూ నోటీసులు జారీ చేసింది. దీంతో కర్నాటక ప్రభుత్వం సెప్టెంబర్ 5 కల్లా అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు వాదనలు వినిపించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications