కేంద్రానికి సుప్రీం షాక్-రాజద్రోహం చట్టం అమలు నిలిపివేత-రఘురామ సహా వేలమందికి ఊరట
దేశవ్యాప్తంగా గత దశాబ్దకాలంగా పెట్టిన రాజద్రోహం కేసులు కలకలం రేపాయి. ముఖ్యంగా కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పాటైన తర్వాత కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విచ్చలవిడిగా రాజద్రోహం కేసులు పెట్టడం మొదలుపెట్టాయి. వీటిపై కుప్పలుతెప్పలుగా దాఖలవుతున్న పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు... ఈ చట్టం అమలును నిలిపేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

వివాదాస్పద రాజద్రోహ చట్టం
భారత్ లో బ్రిటీష్ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు వేల మంది స్వాతంత్ర సమరయోధులపై అప్పటి ఈస్టిండియా కంపెనీ రాజద్రోహం కేసులు బనాయించేది. దేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా ఐపీసీలో నాన్ బెయిలబుల్ సెక్షన్ అయిన 124ఏ ప్రకారం ప్రభుత్వాలు విచ్చలవిడిగా తమకు నచ్చనివారిపై రాజద్రోహం కేసులు బనాయిస్తూనే ఉన్నాయి. జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ప్రత్యర్ధి పార్టీల నేతలు.. ఇలా చూస్తే వేల మందిపై అక్రమంగా రాజద్రోహ కేసులు బనాయించి జైళ్లలోకి నెట్టడం సర్వసాధారణమైంది. కానీ తెగేవరకూ లాగిన ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఇవాళ చెక్ పెట్టింది.

రాజద్రోహ చట్టం అమలు నిలిపేసిన సుప్రీంకోర్టు
ప్రత్యర్ధుల్ని టార్గెట్ చేసేందుకు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగిస్తున్న రాజద్రోహ చట్టంపై కుప్పలు తెప్పలుగా దాఖలవుతున్న పిటిషన్లను విచారిస్తున్న సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇవాళ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా రాజద్రోహ చట్టాన్ని పునస్సమీక్షిస్తామని కేంద్రం చెప్పినా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అప్పటివరకూ రాజద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేయడాన్ని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఈ చట్టం కింద కేసులు పెట్టొద్దని కూడా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

జైళ్లలో మగ్గుతున్న వారందరికీ బెయిల్ ఛాన్స్
సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే దేశవ్యాప్తంగా రాజద్రోహం చట్టం కింద అరెస్టై జైళ్లలో మగ్గుతున్న వారందరికీ ఊరట దక్కబోతోంది. వీరంతా స్ధానిక ట్రయల్ కోర్టుల్ని ఆశ్రయించే బెయిల్ పొందే అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది. దీంతో వేల మంది జైళ్లలో నుంచి విముక్తి పొందేందుకు అవకాశం దొరికింది. అలాగే కొత్త కేసులు కూడా నమోదు చేయరాదని ఇచ్చిన ఆదేశాల వ్రభావం కూడా భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సిద్ధిక్ కప్పన్ టూ రఘురామకు ఊరట
కేంద్ర ప్రభుత్వం నమోదు చేస్తున్న రాజద్రోహం కేసులు రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం వరంగా మారాయి. ఈ క్రమంలో సిద్ఘిక్ కప్పన్ వంటి జర్నలిస్టులు, రఘురామరాజు వంటి రెబెల్ ఎంపీలు, జడ్డి రామకృష్ణ వంటి వారు ఎందరో ఇందులో బాధితులుగా మారిపోయారు. సెక్షన్ 124ఏ కింద వీరిపై నమోదైన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వీరందరికీ సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు ఎంతో ఊరటనిచ్చాయి. అయితే సుప్రీం తాజా ఉత్తర్వులతో వీరిపై కేసులు కొట్టేయకపోయినా కనీసం భవిష్యత్తులో ఈ చట్టం విషయంలో సుప్రీం తీసుకోబోయే నిర్ణయం సంకేతాలు అయితే వెలువడ్డాయి. భవిష్యత్తులో కేంద్రం సమీక్ష తర్వాత రాజద్రోహ చట్టం అమలుపై అభ్యంతరాలు వ్యక్తం కాకపోతే సుప్రీంకోర్టు దాన్ని కొనసాగించే అవకాశముంది. అలా కాకపోతే మాత్రం దేశంలో ఇప్పటికే రాజద్రోహం కేసులు ఎదుర్కొంటున్న వేలాది మందికి పూర్తి ఊరట దక్కనుంది.












Click it and Unblock the Notifications