గ్యాంగ్రేప్ కేసులో దోషికి సుప్రీం చీవాట్లు: పిటీషన్ను కొట్టి పడేసిన సుప్రీం: కొత్త విషయాలేమైనా.. !
న్యూఢిల్లీ: దేశం మొత్తాన్నీ వణికించిన పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై చోటు చేసుకున్న అత్యాచారం కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న దోషి పవన్ కుమార్ గుప్తాకు దేశ అత్యున్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. ఆయన పెట్టుకున్న స్పెషల్ లీవ్ పిటీషన్ (ఎస్ఎల్పీ)ని కొట్టి పక్కన పడేసింది. ఈ కేసులో ఎలాంటి విచారణా చేపట్టబోయేది లేదని, కొత్త విషయాలేమైనా ఉంటే చెప్పాలని పవన్ కుమార్ గుప్తా తరఫు న్యాయవాది ఏపీ సింగ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

ఢిల్లీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ..
నిర్భయపై చోటు చేసుకున్న సామూహిక అత్యాచారం కేసులో పవన్ కుమార్ గుప్తా ఉరిశిక్షను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మూడు రోజుల కిందట అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పవన్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ సుప్రీంకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సోమవారం ఈ పిటీషన్ ధర్మాసనం సమక్షానికి వచ్చింది.

ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సమక్షానికి..
న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి సారథ్యంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బోపన్నలతో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటీషన్పై విచారణ చేపట్టింది. పవన్ కుమార్ గుప్తా తరఫున న్యాయవాది ఏపీ సింగ్ వాాదనలను వినిపించారు. సంఘటన చోటు చేసుకున్న 2012 డిసెంబర్ 16వ తేదీ నాటికి పవన్ గుప్తా ఇంకా మైనరేనని, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ ఢిల్లీ న్యాయస్థానానికి అందజేసినప్పటికీ.. దాన్ని పరిగణనలోకి తీసుకోలేదనేది అన్నారు.

మైనర్ కాదంటూ..
తాము సమర్పించిన సాక్ష్యాధారాలను ఏవీ పరిశీలించకుండా, కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకుండా ఢిల్లీ న్యాయస్థానం డెత్ వారెంట్ను జారీ చేసిందని పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం తరఫున న్యాయవాది తుషార్ మెహతా స్పందించారు. పవన్ గుప్తా మైనర్ కాదనే విషయాన్ని ఢిల్లీ సెషన్స్ న్యాయస్థానం 2013 జనవరిలో ఓ రికార్డును నమోదు చేసిందని వెల్లడించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన ధర్మాసనానికి అందజేశారు. సంఘటన చోటు చేసుకున్న సుమారు నెలరోజుల తరువాత సెషన్స్ కోర్టు.. దీన్ని రికార్డు చేసిందని గుర్తు చేశారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం..
దీనితో ధర్మాసనం ఏపీ సింగ్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే ఏపీ సింగ్ ఢిల్లీ హైకోర్టు, సెషన్స్ కోర్టుల చుట్టూ తిరిగారని, అయినప్పటికీ సరైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టలేకపోయారని వ్యాఖ్యానించింది. కిందిస్థాయిలో పలు న్యాయస్థానాలు తోసిపుచ్చిన కేసుపై పిటీషన్ దాఖలు చేయడంలో అర్థమేంటని ప్రశ్నించింది. ఈ కేసులో కొత్త విషయాలేమైనా ఉంటే వెల్లడించాలని, ఇప్పటిదాకా ఏపీ సింగ్ వినిపించిన సమాచారం అంతా పాతదేనని పేర్కొంది.












Click it and Unblock the Notifications