మెరిటల్ రేప్ నేరమే: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా దీనిపై స్పందించాలని స్పష్టం చేసింది. సుప్రీం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి 21న తదుపరి విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీకి చెందిన ఖుష్భూ సైఫీ అనే మహిళ ఒక పిటిషన్ దాఖలు చేశారు. కర్ణాటకకు చెందిన మరో వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఢిల్లీకి చెందిన మహిళ అంతకుముందు ఆ రాష్ట్ర హైకోర్టును శ్రయించింది. దీనిపై విచారించిన కోర్టు.. మే 11, 2022లో వేర్వేరు తీర్పులను వెలువరించింది.
జస్టిస్ రాజీవ్ శక్దేర్, జస్టిస్ సి హరిశంకర్ తో కూడిన ధర్మాసనం.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించింది. ఐపీసీలోని సెక్షన్ 375 ప్రకారం.. మైనర్ కాని భార్యతో భర్త లైంగిక సంభోగం జరపడం నేరం కాదు. అయితే, ఈ సెక్షన్ రాజ్యాంగ బద్ధతను కొందరు సవాల్ చేశారు. లైంగికంగా వేధించే భర్తతో కాపురం చేసే మహిళ హక్కుల్ని ఈ సెక్షన్ హరించేలా ఉందని వాదిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు.
భార్య సమ్మతి లేకుండా లైంగిక సంభోగం చేస్తే భర్తను నేరస్థుడిగా పరిగణించవచ్చని డివిజన్ బెంచ్ కు నేతృత్వం వహించిన రాజీవ్ శక్దేర్ తీర్పులో పేర్కొన్నారు. సెక్షన్ 375, 376(ఈ) మినహాయిస్తే... వైవాహిక అత్యాచారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15,19(1)(ఏ),21లను ఉల్లంఘించే అంశం అని స్పష్టం చేశారు. అయితే, అదే ధర్మాసనంలో మరో సభ్యుడైన జస్టిస్ హరిశంకర్.. ఇందుకు భిన్నంగా తీర్పునిచ్చారు. ఐపీసీలోని సెక్షన్ 375 రాజ్యాంగ విరుద్ధం కాదని.., ఆర్టికల్ 14, 19(1)(ఏ), 21లను ఉల్లంఘించినట్లు కాదని పేర్కొన్నారు. పలు భిన్నమైన తీర్పుల నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని స్పందించాలని ఆదేశించింది.