కేంద్రానికి హైఓల్టేజ్ షాక్: మూడు వ్యవసాయ చట్టాలిక చెల్లవ్: సుప్రీం స్టే: కీలక ట్విస్ట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం హైఓల్టేజ్ షాక్ ఇచ్చింది. మూడు వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తూ స్టే జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ స్టే కొనసాగుతుందని కుండబద్దలు కొట్టింది. ఇది తాత్కాలికమేనని, ఈ చట్టాల్లో రైతాంగ ప్రతినిధుల సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసిన తరువాత.. మళ్లీ అమలు చేసే అవకాశాన్ని కల్పించింది. రైతులు నిరసన ప్రదర్శనలను నిర్వహించడానికి అనుమతిని నిరాకరించిన ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించదలిచిన ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకోవడంపై దరఖాస్తును దాఖలు చేయాలని సూచించింది.
సెంట్రల్ విస్టా: మోడీ సర్కార్కు సుప్రీం కీలక ఆదేశాలు: అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి..ట్విస్ట్
హామీల అమలుపై అనుమానాలు..
మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు తుది విచారణను చేపట్టింది. పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే, మనోహర్ లాల్ శర్మ తన వాదనలను వినిపించారు. పిటీషన్దారుల్లో మనోహర్ లాల్ శర్మ కూడా ఒకరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణను చేపట్టింది. మనోహర్ లాల్ శర్మ తన వాదనలను ఆరంభించారు. రైతాంగ ప్రతినిధులతో చర్చించడానికి కేంద్రమంత్రులు వస్తున్నారే తప్ప..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించట్లేదని పేర్కొన్నారు.
రాజకీయాలతో సంబంధం లేని అంశం..
మూడు వ్యవసాయ చట్టాల అమలుతో పాటు, రైతాంగ ప్రతినిధులతో భేటీ సందర్భంగా మంత్రులు ఇచ్చిన హామీలను ప్రధాని ప్రకటించట్లేదని అన్నారు. ఫలితంగా- రైతులు మంత్రులు ఇచ్చిన హామీ అమలవుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయని చెప్పారు. అనంతరం హరీష్ సాల్వే తన వాదనలను వినిపిస్తూ- మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఎదురైతే దాన్ని రాజకీయ విజయంగా ఎవరూ భావించకూడదని సూచించారు. ఇది రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని అంశంగా పరిగణించాల్సి ఉంటుందని అన్నారు.
రామ్లీలా మైదాన్ సహా..
400 మందికి పైగా రైతులు దాఖలు చేసిన పిటీషన్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు దుష్యంత్ దవే, హెఎస్ ఫూల్కా, కొలిన్ గొన్సాల్వేస్ తమ వాదనలను వినిపించారు. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనల్లో పాల్గొన్నారు. వాదనల సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎస్ఏ బొబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలోని రామ్లీలా మైదాన్ సహా వేర్వేరు ప్రాంతాల్లో తమ నిరసనలను తెలియజేయడానికి రైతులు ఢిల్లీ పోలీస్ కమిషనర్కు దరఖాస్తును దాఖలు చేసుకోవాలని ఆయన సూచించారు. సమస్యను పరిష్కరించడానికి తాము ఇదివరకే ఓ కమిటీని నియమించామని, రైతులు దీన్ని పట్టించుకోవట్లేదని అన్నారు.
పరిష్కారానికే ప్రయత్నిస్తున్నాం..చీఫ్ జస్టిస్..
దీన్ని బట్టి చూస్తోంటే సమస్య పరిష్కారం కాకూడదని రైతులు కోరుకుంటున్నట్లు కనిపిస్తోందని బొబ్డే వ్యాఖ్యానించారు. తాము సమస్యను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, రైతులు మాత్రం నిరసనలను నిరవధికంగా కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నట్లు అర్థమౌతోందని చెప్పారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదనలను వినిపిస్తూ.. రైతుల నిరసన ఉద్యమంలో ఖలిస్తాన్ చొరబడిందని వ్యాఖ్యానించారు. దీనిపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ- ఎవరో చేసిన ఆరోపణలను తమ వద్ద వినిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనిపై పక్కా ఆధారాలు ఉంటే అఫిడవిట్ రూపంలో బుధవారం నాటికి సమర్పించాలని ఆదేశించారు.
Recommended Video