సూరజ్ కుండ్ మేళాలో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు
హరియాణా ఫరీదాబాద్ లో నిర్వహిస్తున్న సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ జాయ్ రైడ్(రంగుల రాట్నం) కుప్పకూలిన ఘటనలో ఒకరు మరణించగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ మేరకు జాయ్ రైడ్ ఆపరేటర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలను అన్వేషిస్తున్నారు.
హరియాణాలోని ఫరీదాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం సుమారు 6:15 గంటల సమయంలో సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళాలో 'సునామీ స్వింగ్' అనే భారీ రంగుల రాట్నం(జాయ్ రైడ్) ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ రైడ్ లో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. రైడ్ కూలిన వెంటనే అక్కడ తొక్కిసలాట జరిగింది. దాంతో సందర్శకులు భయాందోళనతో పరుగులు తీశారు.
ఇక ఈ ప్రమాదంలో హరియాణా పోలీస్ విభాగానికి చెందిన ఇన్ స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. రంగుల రాట్నం పనిచేయకపోవడాన్ని గమనించిన ఆయన, అందులో ఉన్న వారిని రక్షించేందుకు యత్నించారు. ఈ సమయంలోనే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రజలను సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా, జాయ్ రైడ్ కు సంబంధించిన ఒక భారీ భాగం ఆయన ముఖానికి, తలకు బలంగా తగిలింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి మరణించినట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో గాయపడిన మరో 13 మందిని పోలీసులు స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

ఇక ఈ ఘటనపై హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన ఇన్స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications