టిడిపి తిరకాసు, అవిశ్వాసంపై నో: తేల్చేసిన సుష్మా
న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుపై వ్యతిరేక చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ గురువారం తేల్చేశారు. సీమాంధ్ర కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం నోటీసును ఇచ్చిన విషయం తెలిసిందే.
సీమాంధ్ర కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు విభజనపై ఇవ్వగా, తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అధిక ధరలు, అవినీతి పైన నోటీసు ఇచ్చాయి. అయితే వారు ఆందోళన చేస్తోంది మాత్రం విభజనను నిరసిస్తూనే. విభజనపై నోటీసు ఇస్తే మద్దతు లభించదనే అభిప్రాయంతోనే టిడిపి భిన్నమైన నోటీసు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మద్దతు కోసం వారు బిజెపి నేతలను కూడా కలిశారు.
అయితే, బిజెపి మాత్రం సీమాంధ్ర ఎంపీలకు షాక్ ఇస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ మద్దతుపై చెప్పగా... గురువారం సుష్మ తేల్చేశారు. సీమాంధ్ర ఎంపీలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిచ్చేది లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుపై వ్యతిరేక చర్యలను తాము సమర్థించమన్నారు.
తెలంగాణ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. బిల్లుకు తమ మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిజెపి కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెసు పార్టీ సొంత పార్టీ పార్లమెంటు సభ్యులను కంట్రోల్ చేయలేకపోతోందని విమర్శించారు.
కాగా, లోక్పాల్ బిల్లును సోమవారం లోకసభ ముందుకు తీసుకు రావాలన్నారు. మూజువాణి ఓటు ద్వారా లోక్పాల్ బిల్లుకు ఆమోదం తెలపాలని సూచించారు. స్వలింగ సంపర్కుల హక్కులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు.