'మత గ్రంధాలపై కాకుండా రాజ్యాంగంపై ప్రమాణం'
ముంబై: దేశంలో 'మత ఆధారిత రాజకీయాల' కు చెక్ పెట్టాలంటే మత పరమైన గ్రంధాల మీద కాకుండా అందరూ రాజ్యాంగంపై ప్రమాణం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన మోడీని శివసేన కోరింది.
'అన్ని మతాల వారికి కూడా రాజ్యాంగమే పవిత్ర మత గ్రంధం. చట్టం ముందు అందరూ సమానులే, కానీ రాజ్యాంగం అనేది అన్నింటి కంటే అత్యుత్తమమైనది' అని బాల్ థాక్రే వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా శివసేన గుర్తు చేసింది.
'చట్టం ముందు అందరూ సమానులే, అయితే రాజ్యాంగమే అందికంటే సుప్రీం' అని సామ్నాలో పేర్కొంది. కోర్టుల్లో ప్రజలంతా మత గ్రంథాల పైన కాకుండా రాజ్యాంగంపైనే ప్రమాణం చేసేలా చర్యలు తీసుకోవాలని శివసేన కోరింది.
ఇలా చేయడం ద్వారా దేశంలో ఉన్నటువంటి మతపరమైన అడ్డంకులు తొలగిపోతాయని శివసేన అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది. ఇటీవల పార్లమెంట్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంధంగా పేర్కొన్నారు.
అంతేకాకుండా రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఆత్మహత్యకు పాల్పడటంతో సమానం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన పైవిధంగా స్పందించింది. భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన మన రాజ్యాంగాన్ని ప్రతి ఏడాది స్మరించుకునేందుకు గాను నవంబర్ 26ని రాజ్యాంగం డేగా ప్రకటించారు.