భారత్ కు తాలిబన్ల తొలి లేఖ..ఆఫ్ఘనిస్థాన్ కు భారత్ నుండి విమానాలు నడపాలంటూ విజ్ఞప్తి
ఆఫ్ఘనిస్థాన్ కు విమానాలు నడపాలని భారతదేశానికి తాలిబన్లు లేఖ రాశారు. ఈ మేరకు ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ల ఇస్లామిక్ ఎమిరేట్స్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో అధికారిక సంప్రదింపులు జరిపింది. ఆఫ్ఘనిస్తాన్ మరియు భారతదేశంలో తాలిబాన్ ప్రభుత్వం మధ్య జరిగిన మొదటి కమ్యూనికేషన్లో, రెండు దేశాల మధ్య విమానాల పునరుద్ధరణ కోసం భారత ప్రభుత్వానికి లేఖ రాసింది.
Recommended Video
రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించటం కోసం లేఖ రాసిన తాలిబన్లు
ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇస్లామిక్ ఎమిరేట్లో కొత్త పాలన భారతదేశానికి రాసిన మొదటి లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ను ఉద్దేశించి రాసిన ఈ లేఖ ఆఫ్ఘనిస్తాన్ పౌర విమానయాన సంస్థ తాత్కాలిక మంత్రి అల్హాజ్ హమీదుల్లా అఖుంజాదా రాశారు. దీనిపై తేదీ సెప్టెంబర్ 7 నాడు రాసినట్టుగా ఉంది. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించటం కోసం ఈ లేఖ రాసినట్టు తెలుస్తుంది. అఖుంజాదా తాను రాసిన లేఖలో డీజీసీఏ కి తన అభినందనలు తెలిపిన తరువాత, ఇటీవల అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ ను విడిచి వెళ్లేముందు కాబూల్ విమానాశ్రయం దెబ్బతిందని పేర్కొన్నారు.
కాబూల్ విమానాశ్రయం పునరుద్ధరణ .. విమానాల రాకపోకలకు లేఖ
అప్పటినుండి కాబూల్ విమానాశ్రయం కార్యకలాపాలను కొనసాగించలేదని, అప్పటి నుండి విమాన యాన సర్వీసులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. మా సోదర దేశమైన ఖతార్ సాంకేతిక సహాయంతో, విమానాశ్రయం మరోసారి పునరుద్ధరించబడింది అని స్పష్టం చేశారు.
ఎయిర్ పోర్టులో కార్యకలాపాలను ప్రారంభించే విషయమై ఇప్పటికే విమానయాన సంస్థలకు నోటీసులు పంపించామని భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తిరిగి ప్రయాణికులు రాకపోకలు జరగాలని కోరుకుంటున్నామని ఈ లేఖలో పేర్కొన్నారు. ఎయిర్మెన్కు కార్యకలాపాలకు సంబంధించి 6 సెప్టెంబర్, 2021 న జారీ చేయబడిందని వెల్లడించారు.
కమర్షియల్ విమానాల సేవలను కూడా పునరుద్ధరించాలని లేఖ
భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య విమానాలను తిరిగి ప్రారంభించాలని మంత్రి లేఖ ద్వారా అభ్యర్థించారు. తన అధికారిక ఎయిర్ లైన్స్ అయిన అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్ , కామ్ ఎయిర్ లైన్ విమాన సర్వీసులను ప్రారంభించాలని కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు భారత్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ప్రయాణికుల రాకపోకలు సాగాలని, కమర్షియల్ విమానాల సేవలను కూడా పునరుద్ధరించాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. అయితే తమ లేఖకు భారత దేశం నుంచి ఇంతవరకు సమాధానం రాలేదని తాలిబన్ ప్రతినిధులు చెబుతున్నారు.
తాలిబన్ పాలనను అధికారికంగా గుర్తించని భారత్ .. తాలిబన్లపై అనుమానం
ఆగస్టు 31 న దోహాలో సమావేశం జరిగినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ పాలనను భారతదేశం అధికారికంగా గుర్తించలేదు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ అరాచక పాలనను ఇండియా తీవ్రంగా వ్యతిరేకించింది. ఖతార్లోని భారత రాయబారి దీపక్ మిట్టల్, దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ అధిపతి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్ని కలిసి చర్చలు జరిపిన తర్వాత కూడా భారత్ ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ పాలనపైన గుర్రుగానే ఉంది. భారత్ కు తాలిబన్లతో ప్రమాదం పొంచి ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది.
చివరిసారిగా ఆగస్టు 21 న కాబూల్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం
ఆగస్టు 30 న అమెరికా దళాలు తమ బలగాలను ఆఫ్ఘనిస్థాన్ నుండి ఉపసంహరించుకున్న తరువాత తాలిబన్ ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి అరాచక పాలన సాగిస్తుంది. ఇక భారత్ తన పౌరులను తరలించడానికి చివరిసారిగా ఆగస్టు 21 న కాబూల్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని నడిపింది. ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్న భారతీయుల భద్రతపై అప్పుడు ఎంతో ఆందోళన చెందింది. ఇప్పుడు విమాన సర్వీసులను పునరుద్ధరించాలని చేస్తున్న విజ్ఞప్తిపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.