మోడీ రూట్ లో కేజ్రీ..! : మోడీకి ధీటుగా "టాక్ టు ఏకే"
ఢిల్లీ : అధికారం చేపట్టిన నాటి నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు, ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య ఏదో ఓ వివాదం చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పరోక్షంగానో ప్రత్యక్షంగానో తలెత్తుతున్న వివాదాలతో ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి. అయితే రాజకీయం సంగతి ఎలా ఉన్నా.. ప్రజల్లోకి చొచ్చుకుపోయే విషయంలో మాత్రం ప్రధాని మోడీనే ఫాలో అవుతున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రధాని మోడీ చేపడుతున్న 'మన్ కీ బాత్' తరహాలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా "టాక్ టు ఏకే.కామ్" అనే ఓ వెబ్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టుగా సమాచారం. పాలనకు సంబంధించిన అంశాలు, పథకాల అమలు తీరు వంటి విషయాలను ప్రధాని మోడీ 'మన్ కీ బాత్' ద్వారాప్రజలతో పంచుకుంటున్నట్టుగానే.. సీఎం కేజ్రీవాల్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
కేజ్రీవాల్ చేపట్టబోతున్న ఈ కొత్త కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే వెబ్ పనులు కూడా పూర్తయిపోయినట్టు సమాచారం. దీనికి సంబంధించిన తొలి కార్యక్రమం జులై 17 ఆదివారం 11 గంటలకు ప్రారంభం కానుంది.
విమర్శలకు ఆప్ జవాబు
కాగా, ప్రధాని మోడీ కార్యక్రమాన్ని కాపీ కొట్టారని వస్తున్న విమర్శల నేపషథ్యంలో ఆప్ నేతలు విమర్శలను తిప్పికొడుతున్నారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంతా ప్రధాని మోడీ వ్యాఖ్యలకే పరిమితమని, ఆయనొక్కరే మాట్లాడుకుంటూ వెళ్లినట్టుగా.. కేజ్రీవాల్ కార్యక్రమం ఉండదని, ఇందులో ప్రజా చర్చలకు ఆస్కారం కల్పిస్తున్నామని చెబుతున్నారు ఆప్ నేతలు.