'అమ్మ'కు భారతరత్న! ఎప్పటికప్పుడు శశికళతో సీఎం: 'ఆరేళ్లుగా కుట్ర'
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇవ్వాలని తమిళనాడు కేబినెట్ శనివారం నాడు తీర్మానం చేసింది.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇవ్వాలని తమిళనాడు కేబినెట్ శనివారం నాడు తీర్మానం చేసింది. ఈ విషయమై కేంద్రానికి సిఫార్సు చేయనున్నారు. ఎంజీఆర్ స్మారక మందిరం పేరు కూడా మార్చుతూ మరో తీర్మానాన్ని నెరవేర్చింది.
జయలలిత మృతి అనంతరం తొలిసారి, పన్నీరు సెల్వం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు తీర్మానాలు చేశారు. పార్లమెంటు కాంప్లెక్సులో జయలలిత కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలని తీర్మానించారు.
శనివారం మధ్యాహ్నం సీఎం పన్నీర్ సెల్వంతోపాటు పలువురు మంత్రులు జయలలిత మహా సమాధిని సందర్శించారు. అక్కడ నుంచి నేరుగా సచివాలయానికి వెళ్లి సమావేశమయ్యారు. సచివాలయంలో కూడా జయ చిత్రపటానికి నివాళులర్పించారు.
సమావేశంలో భాగంగా జయలలిత మృతికి సంతాపం ప్రకటిస్తూ కొన్ని నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రస్తుతం ఉన్న ఎంజీఆర్ స్మారక మందిరం పేరును 'భారతరత్న డాక్టర్ పురట్చి తలైవర్ ఎంజీఆర్ మట్రుం పురట్చితలైవి అమ్మ, సెల్వి జె జయలలిత స్మారకమందిరం'గా మార్చారు.

శశికళతో రెండుసార్లు భేటీ
సీఎం పన్నీర్ సెల్వం శనివారం ఉదయం పోయెస్ గార్డెన్లో శశికళతో భేటీ అయ్యారు. మంత్రివర్గ సమావేశాన్ని ముగించుకుని సాయంత్రం 6.45 గంటలకు మళ్లీ మరోమారు శశికళను కలిశారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పన్నీర్సెల్వం మూడు రోజులుగా ఎప్పటికప్పుడు శశికళను కలవడం గమనార్హం.
జయ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలి: తెలుగు యువశక్తి
జయ మరణంపై సిబిఐ విచారణ జరిపించాలని తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ డిమాండ్ చేసింది. 75 రోజుల పాటు చికిత్స కొనసాగించడం, పూర్తిగా కోలుకున్నారని చెప్పిన తర్వాత గుండెపోటుతో మరణించారని చెప్పడం నమ్మశక్యంగా లేదని, జయ మరణం వెనుక దాగి ఉన్న రహస్యాలను ఛేదించేందుకు సిబిఐ విచారణ జరపాలని సంస్థ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి అన్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు జయపై కుట్ర జరిగిందని చెప్పారు.












Click it and Unblock the Notifications