తమిళనాడులో సీబీఐకి నో ఎంట్రీ: మంత్రి అరెస్టైన గంటల్లోనే స్టాలిన్ సర్కారు సంచలనం
చెన్నై: తమిళనాడులోని ఎంకే స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI)కి తలుపులు మూసేసింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో ఇకపై రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
గతంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఇదే తరహా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడు మంత్రి వీ సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే డీఎంకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందంటూ తీవ్రంగా ఆరోపిస్తూ ఇప్పటికే దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి జనరల్ కన్సెంట్ను ఉపసంహరించుకున్నాయి. ఆ జాబితాలో తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కేరళ, జార్ఖండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తమిళనాడు కూడా ఈ జాబితాలో చేరింది.
మనీలాండరింగ్ కేసులో మంత్రి అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ED). అనేక గంటల పాటు ఆయన్ను విచారించిన ఈడీ.. చివరకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. మంగళవారం తమిళనాడు సచివాలయంలోని ఆయన కార్యాలయంతో సహా, చెన్నైలో మంత్రి ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
ఆ తరువాత మంత్రిని సుదీర్ఘ కాలం పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. అర్ధరాత్రి తరువాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఆయనను ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి, కస్టడీ కోరే అవకాశం ఉంది. మంత్రి అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలు చెలరేగకుండా కరూర్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.
అయితే, ఈడీ అరెస్టుతో మంత్రి అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మంత్రికి బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. ఈడీ వేధింపుల వల్లే సెంథిల్ అనారోగ్యానికి గురయ్యారని డీఎంకే నేతలు ఆరోపించారు.












Click it and Unblock the Notifications