తమిళ రాజకీయ పార్టీల కీలక నిర్ణయం- ఆక్సిజన్ కోసం తెరుచుకోనున్న స్టెర్లైట్ ప్లాంట్
తమిళనాడులో ఓవైపు కరోనా కల్లోలం రేపుతుండగా.. మరోవైపు ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. దీంతో రోగులకు ఊరటనిచ్చేలా రాజకీయ పార్టీలన్నీ కలిసి ఈ కీలకమైన అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. 2018లో వేదాంత గ్రూప్కు చెందిన స్టెర్లైట్ ప్లాంట్లో విషవాయువులు లీక్ కావడంతో 13 మంది చనిపోయారు. దీంతో ప్రభుత్వం ప్లాంట్ను మూసేసింది. ఇప్పుడు ఆ ప్లాంట్ను మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తిరిగి తెరవాలని నిర్ణయించారు.

తమిళనాడులోని తూతుకుడిలో ఉన్న స్టైర్లైట్ ప్లాంట్ను గతంలో మూసేసిన నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తిలో పలు సమస్యలు తలెత్తాయి. దీంతో రోజుకు 1000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ద్యం ఉన్న ఈ ప్లాంట్ను తిరిగి తెరవాలనే డిమాండ్లు మెదలయ్యాయి. అయితే దీనిపై ప్రభుత్వం కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే పరిస్దితి లేకపోవడంతో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.

ఇవాళ పళనిస్వామి ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి హాజరైన రాజకీయ పార్టీలు.. స్టైర్లైట్ ప్లాంట్ను కొన్ని షరతులతో తిరిగి తెరిచేందుకు అంగీకారం తెలిపాయి. దీంతో త్వరలోనే ప్లాంట్ను తెరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంబించింది. అఖిలపక్షభేటీకి హాజరైన డీఎంకే, కాంగ్రెస్, అన్నా డీఎంకే, పీఎంకే వంటి రాజకీయపార్టీలు స్టెర్లైట్ ప్లాంట్ తెరవడంపై తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాయి. ఆక్సిజన్ ఉత్పత్తి మాత్రమే చేయాలని, అందుకు మాత్రమే ప్రభుత్వం కరెంటు, ఇతర సౌకర్యాలు కల్పించాలని పలు రాజకీయ పార్టీలు సూచించాయి. ఇందుకోసం ప్రభుత్వం కూడా ఓ పర్యవేక్షణ కమిటీని నియమించబోతోంది.












Click it and Unblock the Notifications