తమిళనాడులో దారుణం: రుతుస్రావంపై టీచర్ అవమానం, బాలిక ఆత్మహత్య!
తరగతి గదిలో రుతుస్రావం అయినందుకు ఓ బాలికను టీచర్ అవమానించింది.
చెన్నై: రుతుస్రావంపై మన దేశంలో ఇప్పటికీ ఎన్నో అపోహలు. దాని గురించి బహిరంగంగా చర్చించడానికి కూడా చాలామంది వెనుకాడుతుంటారు. అన్నింటికి మించి ఆ విషయంలో స్త్రీలను చులకన చేయడం, అవమానించడం ఇప్పటికీ జరుగుతూనే ఉంది.
అలా అవమానించినందుకే ఏడో తరగతి చదువుతున్న ఓ చిన్నారి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరునెల్వెలి జిల్లా పాళయంకొట్టైకు చెందిన సప్రీన్ హాజీరా(12) స్థానికంగా ఏడో తరగతి చదువుతోంది.
ఇటీవల తరగతి గదిలో రుతుస్రావం అవడంతో ఆమె దుస్తులకు రక్తపు మరకలు అంటుకున్నాయి. తోటి విద్యార్థులు దీనిపై ప్రశ్నించగా.. శుభ్రం చేసుకుని వస్తానని క్లాస్ రూమ్ లో ఉన్న టీచర్ను కోరింది. అయితే ఆ ఉపాధ్యాయురాలు బాలిక పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందిపోయి అందరిముందే అవమానించింది. ఎందుకు అప్రమత్తంగా లేవని నిలదీసింది.

రక్తపు మరకలపై అనుమానం వ్యక్తం చేస్తూ తరగతి గది నుంచి బాలికను పంపించిన టీచర్.. దీనిపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది. టీచర్ ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన సప్రీన్ సోమవారం తెల్లవారుజామున భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లో దీనికి సంబంధించిన వివరాలను పేర్కొంది.
సోమవారం ఉదయం 3గం.కు బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బాలిక కేకలు విని కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు అక్కడికి పరిగెత్తారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యలోనే బాలిక ప్రాణాలు విడిచింది. దీంతో పాఠశాల ముందు బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications