ప్రాణం తీసిన కొత్త మోటారు చట్టం..!! బలవంతంగా కారు ఆపి.. తనిఖీలు, వాగ్వివాదంతో ఒత్తిడికి గురై...
నోయిడా : కొత్త మోటారు వాహన చట్టం కఠిన నిబంధనలు ప్రయాణికుల ప్రాణాలను కూడా తీస్తోంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోతున్నారు. వాహనాలను ఆపి రైడర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్, హెల్మెట్ పేరు చెప్పి భయపడేట్టు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల ఆరాచకాలను ఎదురిస్తోన్న వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఫైన్ల పేరుతో వాహనదారుల వెన్నులో వణుకు వచ్చేట్టు ప్రవర్తించి .. పైశాచిక ఆనందం పొందుతున్నారు. నోయిడాలో ఏకంగా ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చనిపోవడం కలకలం రేపుతుంది.
భయం .. భయం ...
ఢిల్లీ, పరిసరాల్లోని నోయిడా, గురుగ్రామ్ ఇతర ప్రాంతాలకు చెందిన వాహనదారులు ఇంటి నుంచి వెహికిల్ బయటకు తీయాలంటే భయపడుతున్నారు. రహదారిపైకి వచ్చాక తమను ఎక్కడ ఏ పోలీసు ఆపుతాడేమోనని వణికిపోతున్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త మోటారు వాహన చట్టం పేరుతో వేలకు వేలు ఫైన్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ఆదివారం నోయిడాలో విషాదకర ఘటన జరిగింది. కొత్త మోటారు వాహన చట్టం పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్తో వాగ్వివాదానికి దిగారు పోలీసులు. అదీ చినికి చినికి గాలివానలా మారింది. చివరకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణం తీసేందుకు కారణమైంది. తమ కుమారుడితో ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని అతని పేరెంట్స్ మీడియాకు తెలిపారు.
కారు ఆపి ..
నోయిడాలోని ఘజియాబాద్ వల్ల సీఐఎస్ఎఫ్ నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటలకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంటికి వస్తున్నారు. కారులో తన పెద్దమ్మ, పెద్ద నాన్నను తీసుకొని వస్తున్నారు. ఇంతలో సీఐఎస్ఎఫ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు అతని కారును నిలిపివేశారు. ఎందుకు అని అడిగితే కొత్త మోటారు వాహన చట్టం పేరు చెప్పారు. తన వద్ద అన్నీ లైసెన్స్, ఆర్సీ ఉన్నాయని చెప్పిన .. వినిపించుకోలేదు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధ్య మాటా మాటా పెరిగింది. అయినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు వినిపించుకోలేదు. కారును ఎట్టి పరిస్థితుల్లో తనిఖీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. కారులో తన పెద్దనాన్న, పెద్దమ్మ ఉన్నారని చెప్పినా .. కనికరించలేదు.
అధికారం ఉందని ..
కారుని నిలిపివేసి .. బలవంతంగా డోర్ తీశారు. తనిఖీల పేరుతో కాలయాపన చేశారు. దీంతో 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ .. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వివాదం పీక్కి చేరింది. అయితే ఆయన షుగర్ పేషంట్ కూడా .. దీంతో ఒత్తిడికి గురయ్యారు. కారు తనిఖీ ప్రక్రియ పూర్తయ్యాక ఇంటికి వెళ్లిపోయారు. పోలీసులతో వాగ్వివాదంతో సాఫ్వేర్ ఇంజినీర్ ఒత్తిడికి గురై ఆస్పత్రి పాలయ్యారు. ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే డయాబెటిస్ పేషంట్ అయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్కు గుండెపోటు కూడా వచ్చింది. ఆయనను బ్రతికేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆయన చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
ఇదేం చట్టం బాబు ...
కారులో ప్రయాణించిన అతని పెద్దనాన్న పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. కొత్త ట్రాఫిక్ నిబంధనలతో జరిగే మార్పు ఏంటీ అని ప్రశ్నించారు. అన్నీ సక్రమంగా ఉన్న వాహనాలను ఆపి తనిఖీ చేసే అధికారం ఉందా అని నిలదీశారు. ర్యాష్ డ్రైవింగ్ చేయకున్నా ప్రశ్నించే హక్కు ఎక్కడిదన్నారు. కారులో ఇద్దరు వృద్ధులు ఉన్నా అర్థం చేసుకోరా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కారుపై లాఠీని ఝులిపిస్తూ .. తనిఖీ చేయడం సరికాదని సూచించారు. ట్రాఫిక్ పోలీసుల అనుచిత ప్రవర్తనపై సెక్టార్ 58 పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.