మహా తెలివిమంతుడు: లాయర్లు, జడ్జిలనే బోల్తా కొట్టించాడు?.. చివరికిలా..
న్యూఢిల్లీ: అతనో ఎంటెక్ హోల్డర్. న్యాయశాస్త్రానికి సంబంధించిన విషయాలపై బాగా అవగాహన ఉన్నవాడు. సుప్రీం కోర్టు న్యాయమూర్తితోనూ పరిచయాలు ఉన్నాయని నమ్మించగలవాడు. అలా నమ్మించే.. ఎంతోమంది సీనియర్ న్యాయవాదులను, న్యాయమూర్తులను సైతం బురిడీ కొట్టించాడు. అయితే ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో అతగాడి మోసాలన్ని బయటపడ్డాయి.
ఎవరితను?:
అపరజిత్ బాసక్(52) పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం మహారాష్ట్రలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇతను లండన్ లో ఎంటెక్ పూర్తి చేశాడు. ఇంగ్లీషులో బాగా మాట్లాడే బాసక్ కు న్యాయశాస్త్రంపై కూడా కొంత పట్టు ఉంది. ఆ పట్టుతోనే చాలామంది న్యాయవాదులను బురిడీ కొట్టించాడు.
రహస్యంగా.. అన్నీ తానే చూసుకుంటానని!:
రాజస్థాన్, ఢిల్లీ హైకోర్టు, ఆఖరికి సుప్రీం కోర్టుల్లో పోస్టింగ్ ఇప్పిస్తానంటూ చాలామంది న్యాయవాదుల వద్ద డబ్బు గుంజాడు బాసక్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ)తో రహస్య మీటింగ్ ఏర్పాటు చేసి అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటానని మాయ మాటలు చెప్పి ఎంతోమందిని ఇలాగే మోసం చేశాడు.
ఇలా దొరికిపోయాడు..:
తాను సీజేఐకి అత్యంత సన్నిహితుడినని చెప్పి.. మొదట కొంతమంది న్యాయవాదుల నుంచి రూ.30వేలు-రూ.50వేలు వరకు గుంజాడు బాసక్. ఇదే క్రమంలో రాజస్థాన్ కు చెందిన ఓ రిటైర్డ్ జడ్జికి వల వేయబోయి దొరికిపోయాడు.
తాను సీజేఐలో అడిషనల్ రిజిస్ట్రార్ అని చెప్పి.. రాజస్థాన్ హైకోర్టులో రీఅపాయింట్ చేయించగలనని ఆయన్ను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ సదరు జడ్జి ఢిల్లీలోని సీజేఐ కార్యాలయాన్ని సంప్రదించడంతో ఇతగాని బాగోతం బట్టబయలైంది.
గతంలో హత్య కేసు కూడా..:
జేఐలో అదనపు రిజిస్ట్రార్ ఎవరూ లేరని, అలాగే ఎటువంటి పోస్టింగులు ఎవరికీ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. దీంతో సదరు రిటైర్డ్ జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాసక్ను అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతంలో ఇతనో హత్య కేసులోను ఇరుక్కుని జైలుకు కూడా వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. 2015లో బెయిల్పై విడుదలై మళ్లీ ఇలాంటి మోసాలకు తెరదీశాడని వివరించారు.