జగన్ భేటీ: తెలంగాణపై తేల్చని శరద్ యాదవ్
న్యూఢిల్లీ: తెలంగాణపై జనతాదళ్ (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏదీ తేల్చి చెప్పలేదు. తెలంగాణపై తమ వైఖరిని పార్లమెంటులో బిల్లుపై చర్చ సందర్భంగా వెల్లడిస్తామని ఆయన జగన్తో చెప్పారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా జగన్ శనివారం శరద్ యాదవ్ను కలిశారు.
రాష్ట్ర విభజన తీరుపై, ఆర్టికల్ 3పై జగన్ తనకు వివరించినట్లు శరద్ యాదవ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. జగన్ చెప్పిన అంశాలపై ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3ని దుర్వియోగపరుస్తున్న తీరు ఆందోళకరంగా ఉందని ఆయన అన్నారు. అసెంబ్లీ అభిప్రాయం తీసుకోకుండా కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకుంటోందని ఆయన అన్నారు.

శాసనసభ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన ఎలా సాధ్యమని జగన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోవాలని తాను శరద్ యాదవ్ను కోరినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తోందని, దాన్ని సవరించాల్సిన అవసరం ఉందని జగన్ శరద్ యాదవ్తో చెప్పారు.
శాసనసభలో, పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీతోనే ఏ రాష్ట్రాన్నైనా విభజించాలని జగన్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాల్సిన అవసరం గురించి జగన్ తనకు వివరించినట్లు శరద్ యాదవ్ తెలిపారు. ప్రజాభిప్రాయం లేకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications