ఎన్ఆర్సీ,సీఏఏ ఎఫెక్ట్ : టెలికాం కంపెనీలకు భారీ నష్టం.. ఎంతో తెలుసా?
జాతీయ పౌర పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లకు వ్యతిరేకంగా అసోం,ఉత్తరప్రదేశ్,ఢిల్లీల్లో జరిగిన హింసాత్మక ఆందోళనలు టెలికాం కంపెనీలకు తలనొప్పిగా మారాయి. హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రతీసారి ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తుండటంతో ఆయా కంపెనీలు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నాయి. ఒక అంచనా ప్రకారం.. దేశీయ టెలికాం ఆపరేటర్స్ గంటకు 24.5 మిలియన్ల రూపాయాలు నష్టపోతున్నారు. సెల్యులర్ ఆపరేషన్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(COAI) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ ఈ విషయం వెల్లడించారు.
శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని 18 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు వచ్చినట్టు ఓ టెలికాం కంపెనీ చెప్పింది. అలాగే ఢిల్లీ శివారు ప్రాంతాల్లోనూ డిసెంబర్ 28 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాల్సిందిగా ఓ ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో టెలికాం కంపెనీలుతమకు వాటిల్లుతున్న నష్టంపై ఆందోళన చెందుతున్నాయి.
కాగా,భారతీయులు ప్రతీ నెలా సగటున 9.8 గిగా బైట్ల డేటాను వినియోగిస్తున్నారు. స్వీడిష్ టెలికాం గేర్మేకర్ ఎరిక్సన్ ప్రకారం ఇది ప్రపంచ దేశాలన్నింటి కంటే అత్యధికం. ఫేస్బుక్,వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలకు భారత్లోనే అత్యధిక యూజర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరుచూ 'ఇంటర్నెట్ షట్ డౌన్స్' ప్రకటించడం టెలికాం కంపెనీలకు ఆర్థిక ఇబ్బందులను కొనితెచ్చేలా మారింది.