నరేంద్ర మోడీ జోరుపై టిడిపి ఆశలు, ఆచితూచి బిజెపి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన ఆశలు పెట్టుకుందా? అంటే అవుననే అంటున్నారు. టిడిపి పదేళ్ళుగా అధికారానికి దూరంగా ఉంది. 2014 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ఎన్నికలలోపే రాష్ట్రం విడిపోయే అవకాశాలున్నప్పటికీ ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఇందులో భాగంగా బిజెపి కంటే మోడీని ఎక్కువగా నమ్ముకున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉత్తర భారత దేశంలో ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో స్థానిక నాయకుల సత్తాకు మోడీ హవా కూడా తోడైంది. దీంతో బిజెపి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో జెండా ఎగురవేసింది. ఢిల్లీలో మెజార్టీ సీట్లను సాధించింది.

ఉత్తర భారతం అంతా కాకపోయినా దక్షిణాదిన కూడా మోడీ హవా కనిపిస్తోంది. మోడీ హవా క్రమంగా పెరుగుతోంది. బిజెపి తెలంగాణకు మద్దతిస్తున్నప్పటికీ సీమాంధ్రలో మోడీ ప్రభావం కనిపిస్తోంది. ఇక తెలంగాణకు ఎలాగు మద్దతిస్తున్నందున బిజెపి ఆ ప్రాంతంలో బాగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఇరు ప్రాంతాల్లో మోడీ, తెలంగాణ హవాలతో టిడిపికి లబ్ధి చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
టిడిపితో పొత్తుకు రాష్ట్ర నాయకత్వం ఆసక్తి చూపడం లేదు. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం కొంత ఆసక్తితో ఉన్నారు. అయితే, దీనిపై హడావుడిగా ప్రకటనలు చేయడం లేదు. పొత్తులపై ఆచితూచి స్పందిస్తున్నారు. ఆగస్టులో మోడీ హైదరాబాదు సభలో ఎన్టీఆర్ను పొగడటంతోనే పొత్తుకు టిడిపిని ఆహ్వానించినట్లుగా అందరూ భావించారు. ఇటీవల శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం అందితే బాబు వెళ్లారు. దీంతో పొత్తు పొడిచినట్లుగా అందరు భావిస్తున్నారు.
చంద్రబాబు కూడా అంతర్గత సమావేశాల్లో ఆ వైపు సంకేతాలు ఇచ్చారట. బిజెపి నేత ప్రకాశ్ జవదేకర్ మాత్రం బాబు ప్రమాణ స్వీకారానికి వచ్చినంత మాత్రాన పొత్తు కుదిరినట్లు కాదని, ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత తాము నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేందుకు బిజెపి అగ్రనాయకత్వం, మోడీలు బాబు వైపు మొగ్గు చూస్తున్నా, ఆచితూచి స్పందిస్తున్నారు. బిజెపి కంటే టిడిపి పొత్తు కోసం ఎక్కువ ఆసక్తి కనబరుస్తుందంటున్నారు. మోడీ హవా, బిజెపితో పొత్తు వల్ల రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా తమకు బిజెపి ద్వారా లబ్ధి చేకూరుతుందని టిడిపి నేతలు భావిస్తున్నారంటున్నారు. టిటిడిపి నేతలు బిజెపితో పొత్తు కోసం మొదటి నుండి ఉవ్వీళ్లూరుతున్నారు.
మరోవైపు టిడిపితో పొత్తు పెట్టుకుని మూడు నుంచి ఐదు లోక్సభ స్థానాల్లో, రెండు ప్రాంతాల్లో తగినన్ని విధాన సభ స్థానాలకు పోటీ చేయాలని బిజెపి భావిస్తోంది. ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేసి దెబ్బతినటం కంటే, రెండు చోట్లా బలం ఉన్న తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని లబ్ది పొందే ఆస్కారం ఉన్నందునే బిజెపి వ్యూహాం మారుస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications