ప్రధానిగా మోడీకి 30, జగన్కు 4, బాబుకు 3 శాతం
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో ప్రధానమంత్రి రేసులో గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి 30 శాతం మంది మద్దతివ్వగా.. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి కేవలం మూడు శాతం మద్దతు లభించింది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా రేసులో ఉండటం.. ఇదీ రాహుల్ గాంధీ కంటే ఎక్కువ శాతం మద్దతు లభించడం గమనార్హం.
సిఎన్ఎన్-ఐబిఎన్-సిఎన్డిఎస్-లోక్నీతి సర్వే ప్రకారం.. జగన్కు నాలుగు శాతం మంది ప్రధానిగా మద్దతు పలికారు. జగన్ను ప్రధానిగా చూడాలని నాలుగు శాతం మంది, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రధానిగా చూడాలని మూడు శాతం మంది అభిప్రాయపడ్డారు.
మిగిలిన వారు ప్రధాని అభ్యర్థిపై అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. తెలంగాణ ప్రాంతంలో మోడీకి, రాహుల్ గాంధీకి సమానంగా మద్దతు లభించింది.
ఇరువురికి తెలంగాణలో 21 శాతం మద్దతు లభించింది. కాగా, ఇరు ప్రాంతాల్లో కలిసి టిడిపికి 13-19, జగన్ పార్టీ 9-15, కాంగ్రెసు, తెరాసలు 4-8 మధ్య దక్కే అవకాశముందని సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ సర్వేను మార్చి 18-23 మధ్య జరిపారు. 23 సెలెక్టెడ్ పార్లమెంటరీ నియోజకవర్గాలలో చేశారు.