ఢిల్లీలో కిరణ్Vsజగన్: ఎపిభవన్ వద్ద ఉద్రిక్తత, తోపులాట
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జంతర్ మంతర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ మధ్యాహ్నం మూడు గంటలకు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ధర్నా అనంతరం ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలుస్తారు.
ఢిల్లీలోని ఎపి భవన్లో బుధవారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంత నేతలు, తెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రాంత నేతలు పోటాపోటీ ధర్నాలకు దిగారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో ఎపి భవన్ హోరెత్తుతోంది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేయనున్న నేపథ్యంలో ఆయన విడిది భవనం వైపుకు తెలంగాణవాదులు దూసుకెళ్లారు. ముఖ్యమంత్రి దీక్షా ప్రాంగణానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని సమైక్యవాదులు, సీమాంధ్ర నాయకులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మరోవైపు లోకసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభాపతి మీరా కుమార్ సంతాప తీర్మానాలు చదివి వినిపించారు. సభలో జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తాయి. అనంతరం సభ గంటపాటు వాయిదా పడింది. రాజ్యసభ కూడా వాయిదా పడింది.