టెర్రర్ ఫండింగ్ కేసు: హఫీజ్ సయీద్, సలాహుద్దీన్పై ఎన్ఐఏ ఛార్జీషీటు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాదులైన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సలాహుద్దీన్లపై జాతీయ దర్యప్తు సంస్థ(ఎన్ఐఏ) ఛార్జిషీటు దాఖలు చేసింది. జమ్మూకాశ్మీర్లో ఉగ్ర నిధులకు సంబంధించిన కేసులో వీరిద్దరితో పాటు మరో పదిమంది పేర్లను కూడా దీనిలో చేర్చారు.
ఎన్ఐఏ 1279 పేజీల ఛార్జిషీటును కోర్టు మందుంచింది. ఈ కేసులో విచారణను కొనసాగించేందుకు అనుమతివ్వాలని కోరింది. ఈ కేసులో అరెస్టు చేసిన 10మంది వ్యక్తుల జ్యుడీషియల్ కస్టడీ శుక్రవారంతో ముగియనుంది.
ఉగ్రవాద వ్యతిరేక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాలు అరికట్టే చట్టం కింద ఎన్ఐఏ ఆరునెలల్లో ఛార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు నిందితుడు బెయిలు తీసుకోవడానికి అర్హుడు. ఈ కేసులో 60పైగా ప్రాంతాల్లో సోదాలు చేశామని, 300 మందికి పైగా సాక్షులున్నారని ఎన్ఐఏ కోర్టుకు వివరించింది.
ఈ కేసులో అల్తాఫ్ అహ్మద్ షా అలియాస్ ఫంటూష్, షాహిద్ ఉల్ ఇస్లాం, వేర్పాటువాదులు నయీం ఖాన్, బషీర్ భట్ అలియాస్ పీర్ సైఫుల్లా, రాజా మెహ్రజుద్దీన్ కల్వాల్, ప్రముఖ వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ వటాలిలను గతంలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
2016లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వాణి ఎదురుకాల్పుల్లో మరణించిన అనంతరం జరిగిన అల్లర్ల కేసులో వీరిని అరెస్ట్ చేసింది. జేకేఎల్ఎఫ్ మాజీ మిలిటెంట్ బిట్టా కరటే, ఫొటో జర్నలిస్ట్ కమ్రాన్ యూసుఫ్, జావేద్ అహ్మద్ భట్ల పేర్లు కూడా ఛార్జిషీటులో ఉన్నాయి.
కాగా, సయీద్, సలాహుద్దీన్లు ఉగ్రకార్యకలాపాల కోసం బ్యాంకేతర పద్ధతుల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సరఫరా చేస్తున్నారని ఎన్ఐఏ ఆరోపణ. ముంబై 26/11 ఉగ్రదాడుల కీలక సూత్రధారి అయిన సయీద్ను గత నవంబరులో పాకిస్థాన్ గృహనిర్బంధం నుంచి విడుదల చేసింది.
ఇది ఇలావుంటే.. హఫీజ్ సయీద్పై పాకిస్థాన్లో ఎలాంటి కేసులు లేవని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోమని, సయీద్ను 'సాహిబ్' అని సంబోధిస్తూ గురువారం పాక్ ప్రధాని అబ్బాసీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేత రాంమాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతర్జాతీయ ఉగ్రవాదినే సాహెబ్ అని పిలుస్తున్నారు.. ఇక మీకు ఏ ఆధారాలిస్తే ఏం లాభం? అంటూ ధ్వజమెత్తారు.