జయలలిత కేసు: సుప్రీంను ఆశ్రయించిన డీఎంకే
న్యూఢిల్లీ/చెన్నయ్: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే. జయలలితకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తమిళనాడులో రాజకీయ శత్రువు అయిన డీఎంకే పార్టీ జయలలిత కేసు విషయంలో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేసిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి ఆ కేసును కొట్టి వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును రద్దు చెయ్యాలని డీఎంకే పార్టీ సుప్రీం కోర్టులో సోమవారం అర్జీ సమర్పించింది.
అంతకు ముందు సీబీఐ ప్రత్యేక కోర్టు జయలలితకు విధించిన శిక్షను అమలు చెయ్యాలని మనవి చేశారు. ఇప్పటికే కర్ణాటక హై కోర్టు తీర్పును ప్రశ్నిస్తు కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి జయలలిత మీద ప్రతీకారం తీర్చుకోవడానికి డీఎంకే పార్టీ సుప్రీంను ఆశ్రయించింది. అక్రమాస్తుల కేసు విషయంలో శిక్షపడిన తరువాత జయలలిత సీఎం పదవికి రాజీనామా చేశారు. తరువాత శిక్ష రద్దు కావడంతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ఇటివల ఆర్ కే నగర ఉప ఎన్నికలలో జయలలిత ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే.