పక్కా ప్లాన్.. బుల్లెట్స్ లాంటి టీమ్.. : అమ్మ విజయం వెనుక ఆ ఆరుగురు..!
రాజకీయాల్లో రాణించడమంటే మామూలు విషయమా..! తిమ్మిని బమ్మి చేయగల సత్తా ఉండాలి. మాటలతోనే ప్రత్యర్థిని కట్టడి చేసేంత నేర్పుండాలి. వీటన్నింటికి మంచి ప్రత్యుర్థుల వ్యూహాలను, ప్రజల అభిప్రాయాలను అంచనా వేస్తూ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోగల సమయస్ఫూర్తి ఉండాలి. ఇందుకోసం నమ్మిన బంటుల్లా పనిచేసే అనుచరఘనం కూడా అవసరమే.
తమిళనాడు ఎన్నికల్లో ప్రత్యర్థి కరుణానిధికి షాక్ ఇస్తూ.. వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని దక్కించుకున్న జయలలిత, తన విజయం వెనుక భారీ కసరత్తే చేసినట్టుగా చెప్పుకుంటున్నారు తమిళ జనం. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల్లో ఇవ్వాల్సిన హామీలు లాంటి ముఖ్యాంశాలపై జయ వెనుక ఉన్న ఓ టీమ్ పక్కా ప్రణాళికలు రచించిందట.
ఆశ్యర్యకరంగా.. ఆ టీమ్ లో ఒక్క రాజకీయ నేత కూడా లేకపోవడం గమనార్హం. ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ లతో కూడిన ఆ టీమ్ అమ్మ విజయం కోసం చెమటోడ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో మాజీ ఆఫీసర్లు కూడా ఉన్నారు. జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళకు ఈ టీమ్ ఎప్పటికప్పుడు అనుసరించాల్సన వ్యూహాలపై ప్రణాళికలు సిద్దం చేసి పంపేదని సమాచారం.
వాళ్ల పేర్లను పరిశీలిస్తే.. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయి, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న షీలా బాలకృష్ణన్, తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, మరో మాజీ ఐఏఎస్ లతో పాటు, ఇద్దరు సీనియర్ ఐపీఎస్ (ఏడీజీపీ)లతో పాటు ఒక రిటైర్డ్ డీజీపీతో కూడిన టీమ్ జయలలిత విజయం వెనుక వ్యూహాకర్తలుగా పనిచేసినట్టుగా సమాచారం.