మేయర్ ఎన్నిక: హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికల వివాదంపై సమర్పించిన అర్జీని కర్ణాటక హై కోర్టు బుధవారం విచారణ చెయ్యనుంది. ఎంపీలు, శాసన సభ్యులు, ఎంఎల్ సీలు మేయర్ ఎన్నికలలో ఓట్లు వెయ్యడానికి అవకాశం ఇవ్వరాదని బీజేపీ అర్జీ సమర్పించింది.
బీజేపీ కార్పొరేటర్లు ఆర్. ప్రతిమ, ఉమావతి పద్మరాజ్, దీపా నాగరాజ్, ఎం. ప్రమీళ, కుమారి పళనికాంత్ హైకోర్టులో అర్జీ సమర్పించారు. మంగళవారం అర్జీ విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి ఆర్.ఎస్ చౌహాణ్ విచారణ బుధవారానికి వాయిదా వేశారు.
ఈనెల 11వ తేదిన బీబీఎంపీ మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో 198 కార్పొరేటర్లతో పాటు బెంగళూరు నగరంలోని అన్ని పార్టీల ఎంపీలు, శాసన సభ్యులు, ఎంఎల్ సీలు ఓట్లు వెయ్యడానికి అవకాశం ఉంది.

అయితే ఎంపీలు, శాసన సభ్యులు, ఎంఎల్ సీలు ఈ ఎన్నికలలో ఓట్లు వెయ్యడానికి అవకాశం కల్పించరాదని బీజేపీ హై కోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి మేయర్, డిప్యూటి మేయర్ పదవులు లాక్కోవాలని చూడటంతో బీజేపీ ఈ ప్లాన్ వేసింది.
మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికలకు ప్రస్తుతం 131 ఓట్లు అవసరం. న్యాయస్థానంలో బీజేపీకి అనుకూలంగా తీర్పు వస్తే 100 మంది కార్పొరేటర్లు ఉన్న బీజేపీకి లాభం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ వేసుకున్న అంచనాలు తల్లకిందలు అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications