రేప్ చేస్తుంటే ఏమనిపించింది?: చుక్కలు చూపిస్తున్నారు.. లాయర్ల ప్రశ్నలు దారుణంగా!
ఆ సందర్భంలో అతడిని గోళ్లతో రక్కారా? ఆ సమయంలో మీకు ఏమనిపించింది?.. వంటి ప్రశ్నలతో వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.
న్యూఢిల్లీ: అత్యాచార బాధితుల విషయంలో కోర్టుల్లో న్యాయవాదులు అడుగుతున్న ప్రశ్నలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచార సమయంలో మీరు ఏడ్చారా? అరవడానికి ప్రయత్నించారా?, ఆ సందర్భంలో అతడిని గోళ్లతో రక్కారా? ఆ సమయంలో మీకు ఏమనిపించింది?.. వంటి ప్రశ్నలతో వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.
'పార్ట్నర్స్ ఫర్ లా ఇన్ డెవలప్మెంట్' అనే ఎన్జీవో అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2013లో క్రిమినల్ చట్టానికి సవరణలు తీసుకొచ్చిన తర్వాత రేప్ కేసుల్లో పురోగతి, ఇతరత్రా సంస్కరణలు ఎంతవరకు అమలవుతున్నాయో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేశారు. ఢిల్లీలోని నాలుగు ఫాస్ట్ ట్రాక్ కేసుల్లో విచారించిన 16 రేప్ కేసులను ఈ అధ్యయనం కోసం పరిశీలించారు.
న్యాయవాదులు బాధితులను తీవ్ర అభ్యంతరకర ప్రశ్నలు అడుగుతున్నట్లు అందులో వెల్లడవగా.. దీనిపై క్రిమినల్ లాయర్ రెబెక్కా జాన్ స్పందించారు. గతంతో పోలిస్తే కోర్టులు ఇప్పుడు మరింత సున్నితంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. అయితే కొన్నిసార్లు న్యాయవాదులు అడుగుతున్న ప్రశ్నలను న్యాయమూర్తులు కూడా అడ్డుకోలేకపోతున్నారని అన్నారు.
చాలా ఆసుపత్రుల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా అత్యాచార బాధితులకు వైద్య పరీక్షలు జరగడం లేదని అధ్యయనంలో తేలడం గమనార్హం. ఆసుపత్రుల్లో ఇప్పటికీ 'టు-ఫింగర్ టెస్ట్' చేస్తున్నట్టు బయటపడటం కూడా చర్చనీయాంశంగా మారింది.