కావేరీ చిచ్చు: కర్ణాటకలో బంద్ విఫలం
బెంగళూరు: కన్నడ ఒక్కూట (కన్నడ సంఘాల సమైక్య) పిలుపునిచ్చిన రైళ్ల బంద్ పూర్తిగా విఫలం అయ్యింది. నిర్ణయిత సమయానికే అన్ని రైళ్లు సంచరిస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
బెంగళూరు నగర రైల్వే స్టేషన్, మండ్య జిల్లాలోని అన్ని రైల్వే స్టేషన్ల దగ్గర పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆందోళకారులు రైల్వే స్టేషన్లలోకి ప్రవేశించడానికి తాము అవకాశం ఇవ్వలేదని పోలీసులు చెప్పారు.
కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ కన్నడ సంఘాలు కర్ణాటకలో రైళ్ల బంద్ కు పిలుపునిచ్చారు. గురువారం వేకువజామున నుంచే పోలీసులు రైల్వే స్టేషన్ల దగ్గర మకాం వేశారు.
బెంగళూరులోని క్రాంతివీర సంగోళ్ళి రాయణ్ణ (బెంగళూరు సిటి రైల్వే స్టేషన్), కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, యశవంతపుర, బాణసవాడి, యలహంక తదితర రైల్వే స్టేషన్లలో నిర్ణయిత సమయానికే రైళ్లు సంచరించాయని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు.
మండ్య జిల్లాలో వివిధ రైల్వే స్టేషన్ల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మండ్య జిల్లాలో కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు రైల్వే స్టేషన్లలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.