అక్కడ పబ్జీ ఆడితే జైలుకే ..అందుకే పబ్జీ ఆడిన 10 మంది అరెస్ట్
Recommended Video

పబ్జీ .. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు వ్యసనంగా మారిన గేమ్ . ఈ ఆన్ లైన్ వీడియో గేమ్ విద్యార్థుల ప్రాణాలతోనూ చెలగాటమాడుతోంది. విద్యార్థులు తమ చదువులు సైతం పక్కనపెట్టి పబ్జీ ఆటలో మునిగి తేలుతున్నారు. మొన్నటికి మొన్న పబ్జీ ఆడుతూ ఒక యువకుడు మంచినీళ్లను కొన్ని ఆసిడ్ తాగితే, దేశంలో పలు చోట్ల పబ్జీ ఆడొద్దని తల్లిదండ్రులు ఆంక్షలు పెట్టారని యువకులు ఆత్మహత్య చేసుకొని తిరిగిరాని లోకాలకు చేరిపోయారు. ఇలా వ్యసనం బారిన పడి తనువు చాలించకుండా చేయడానికి గుజరాత్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

గుజరాత్ లో పబ్జీ బ్యాన్ ... పబ్జీ ఆడుతున్న10 మంది అరెస్ట్
అందులో భాగంగానే పబ్జీని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు . ఎవరైనా పబ్జీ ఆడితే అంతే సంగతి అంటున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో రాజ్ కోట్ నగర పోలీస్ కమిషనర్ మనోజ్ అగర్వాల్ కార్పొరేషన్ పరిధిలో ప్రాణాలు తీస్తున్న పబ్ జీ (ప్లేయర్ అన్ నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్) - మొమొ చాలెంజ్ గేములు ఎవ్వరూ ఆడకుండా నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని ఈ నెల 6నుంచి అమలు చేస్తున్నారు. ఇకపై ఈ గేములు ఆడేవారిని అరెస్ట్ చేయాలంటూ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు పంపారు. ఈ నేపథ్యంలో గత మూడు రోజుల్లో ఈ గేమ్ ఆడుతూ పట్టుబడిన పది మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం బెయిల్ కూడా మంజూరు చేశారు. పిల్లలు - యువతలో ఈ ఆటలు హింసాత్మక స్వభావాన్ని అలవరుస్తున్నందున వాటిపై నిషేధం విధించామని కమిషనర్ స్పష్టం చేశారు.
దేశ వాప్తంగా అమలుకు తల్లిదండ్రుల డిమాండ్
ఇక రాజ్ కోట్ లో సత్ఫలితాలు రావడంతో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోనూ ఈ ఆన్ లైన్ హింసాత్మక గేములను నిషేధిస్తూ ఆ నగర పోలీస్ కమిషనర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. పిల్లలు ఎంతకు ఈ ఆటలను విడవకపోవడం.. ఆత్మహత్యలు - హత్యలు పెరిగిపోతున్న నేపద్యంలో దరిమిలా పోలీసులు ఇలా కఠిన చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులు కూడా పిల్లలను ఈ ఆటలు ఆడకుండా కనిపెట్టుకొని ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యంత ప్రాచుర్యం పొంది, ఆడేవారి ప్రవర్తనపై విష ప్రభావం చూపే వీడియోగేమ్ పబ్జీని గుజరాత్ అధికారులు నిషేధించారు. ఈ నిషేధం దేశవ్యాప్తంగా అమలు చేయాలని తల్లిదండ్రుల నుండి డిమాండ్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications