రాష్ట్రాలకు ఆ వ్యాక్సిన్లు ఫ్రీ..వ్యాక్సిన్ ధరల రగడతో కేంద్రం కీలక ప్రకటన..ట్విస్ట్ ఏంటంటే!!
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలను సీరం ఇనిస్ట్యూట్ ప్రకటించిన తర్వాత దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఒకే దేశం ఒకే వ్యాక్సిన్ విధానం అమలు చేయాలని, ధరలు కూడా ఒకే విధంగా ఉండాలని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించాయి .
కేంద్రానికి 150 రూపాయలు, రాష్ట్రాలకు 400 రూపాయలు, ప్రైవేట్ ఆసుపత్రులు ఆరు వందల రూపాయల చొప్పున వ్యాక్సిన్ ధరలను నిర్ణయించటం పై మండిపడిన ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని బిజెపి సర్కార్ ను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాక్సిన్ ల విషయంలో ఆసక్తికర ట్వీట్ చేసింది.
రాష్ట్రాలకు కేంద్రం కొనుగోలు చేసిన వ్యాక్సిన్లు ఫ్రీ గా ఇస్తామని ట్వీట్
కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తున్నామని, ఇకపై కూడా ఉచితంగానే అందిస్తామని ట్వీట్ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన ట్వీట్ లో భారత్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు రకాల వ్యాక్సిన్ లను 150 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నామని , ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న టీకాలను రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పి ఇకపై కూడా అది కొనసాగుతుంది అంటూ ట్వీట్ చేసింది .
రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలు, ప్రైవేట్ ఆస్పత్రులకు 600 రూపాయల ధరపై నో కామెంట్
అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు నాలుగు వందల రూపాయలు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఆరు వందల రూపాయల ధరపై స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు దేశమంతా ఒకే ధర ఉండేలా, కేంద్రానికి రాష్ట్రాలకు ఒకేలా ధర ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఒకవేళ అదనంగా ధర ఉంటే, ఆ అదనపు మొత్తాన్ని పిఎం కేర్ ఫండ్స్ నుంచి చెల్లించి దేశవ్యాప్తంగా సామాన్యులకు కూడా వ్యాక్సినేషన్ అందేలా కేంద్రం చొరవ చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికే లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటున్న ప్రతిపక్షాలు , విమర్శల వెల్లువ
ఇక రాహుల్ గాంధీ ,మమతా బెనర్జీ, సోనియాగాంధీ, సీతారాం ఏచూరి, కేటీఆర్ , జైరాం రమేష్ వంటి రాజకీయ నాయకులు వ్యాక్సినేషన్ విధానాన్ని తప్పుపడుతున్నారు. కార్పొరేట్ సంస్థలకు మోడీ మిత్రులకు లాభం చేకూర్చే ప్రక్రియగా వ్యాక్సిన్ ధరల వ్యత్యాసం పై మండి పడుతున్నారు. వ్యాక్సినేషన్ లో వివక్ష సాగుతుందని , ధరల నిర్ణయం వల్ల సామాన్యులకు వ్యాక్సిన్ అందని ద్రాక్షగా మారుతుందని విమర్శల వర్షం కురిపిస్తున్నారు .
కేంద్రం దాటవేత ధోరణి , ధరలపై మాట్లాడకుండా ఆ వ్యాక్సిన్ లు ఫ్రీ ఇస్తామని ట్వీట్
తీవ్ర విమర్శలు , ప్రశ్నల మధ్య కేంద్రం దాటవేత ధోరణి లో వ్యాక్సిన్ ధరల వ్యత్యాసం పై ఏమీ మాట్లాడకుండా , రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణయించిన ధరలపై ఏమీ చెప్పకుండా, తాము కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్లు మాత్రం రాష్ట్రాలకు ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. ప్రతిపక్షాలు ఇంతగా విమర్శలు చేస్తున్నా, ధరల పై మళ్లీ చర్చ జరపాలని, వ్యాక్సిన్ ధరలను కేంద్రం కట్టడి చేయాలని చెప్తున్నా అవేవి పట్టించుకోకుండా, సింపుల్ గా తాము కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను, రాష్ట్రాలకు ఫ్రీగా పంపిణీ చేస్తామని ప్రకటించి చేతులు దులుపుకోవడం గమనార్హం.