రాహుల్ గాంధీతో పాటు.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం ను చంపేస్తామని బెదిరింపు లేఖ కలకలం
భారత జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని చంపేస్తామంటూ ఓ బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో రాహుల్ జోడో యాత్ర జుని ప్రాంతం మీదుగా వెళ్ళవలసిన క్రమంలో, జుని ప్రాంతంలోని ఒక స్వీట్ షాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఒక లేఖను వదిలి వెళ్లారు. రాహుల్ గాంధీ పాదయాత్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కు రాగానే బాంబుల మోతతో దద్దరిల్లుతుందని, రాహుల్ గాంధీని చంపేస్తామని హెచ్చరించారు.
రాహుల్ గాంధీని చంపేస్తామని బెదిరింపు లేఖ
అంతేకాదు రాహుల్ గాంధీ తో పాటు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను కూడా హతమారుస్తాము అని వారు లేఖలో పేర్కొన్నారు. ఇది ఆకతాయిల పని అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నప్పటికీ, ఇటీవల రాహుల్ గాంధీ మహారాష్ట్రలో సావర్కర్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. రాహుల్ గాంధీకి బెదిరింపు లేఖ రాసిన వారు ఎవరు? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. స్వీట్ షాప్ వద్ద సిసి టివి ఫుటేజ్ ను పరిశీలించి నిందితుడిని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
రాహుల్ గాంధీకి బెదిరింపు లేఖ రాసిన గుర్తు తెలియని వ్యక్తి పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితులు ఎన్ఎస్ఏ కింద అభియోగాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే భారత్ జోడో యాత్రలో భాగంగా వీరసావర్కర్ పై రాహుల్ గాంధీ వీర సావర్కర్ బ్రిటీషర్లకు క్షమాపణలు కోరిన వ్యక్తి అంటూ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి కారణంగా మారాయి.
సావర్కర్ పై రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం.. భగ్గుమన్న శివసేన
సావర్కర్ ను అవమానిస్తే మహా వికాస్ అఘాడీ తో తెగతెంపులు చేసుకునేందుకు వెనుకాడబోమని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ హెచ్చరికలు జారీ చేశారు. సావర్కర్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడవద్దని సూచించారు. శివసేన నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ రాహుల్ గాంధీ వీర సావర్కర్ ను అవమానించ లేదని, చరిత్రలో జరిగిన ఒక విషయాన్ని మాత్రమే చెప్పారని వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న క్రమంలో తాజా బెదిరింపు లేఖ కలకలం రేపుతుంది.