ముగ్గురు ముస్లిం ఫకీరులతో గుంజీళ్ళు తీయించి జై శ్రీరామ్ నినాదాలు; యూపీలో షాకింగ్ ఘటన
మత సామరస్యానికి పుట్టినిల్లయిన భారతదేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించే అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో హిందూ ముస్లింల మధ్య అనేక విషయాలలో తరచు వివాదాలు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ పండిట్లను, అక్కడ మైనారిటీ వర్గాలు గా భావించే హిందువులను ఉగ్రవాదులు హతమారుస్తున్న ఘటనలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా అనేక మసీదులలో హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని, దేవాలయాలను ధ్వంసం చేసి మసీదులను నిర్మించారని కొనసాగుతున్న రగడ ఆందోళనలకు కారణంగా మారాయి.
అంతేకాదు మత సామరస్యానికి విఘాతం కలిగించేలా రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ముగ్గురు ముస్లిం ఫకీరులను గుంజీలు తీయిస్తూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గుపూర్ జిల్లాలోని ఒక గ్రామంలోని కొందరు వ్యక్తులు ముగ్గురు ముస్లిం పురుషులను ఆధార్ కార్డులు అడిగారు. గుంజిళ్లు తీయించి, వారిని జై శ్రీరామ్ నినాదాలు చేయాలని బలవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇకపై 'పండిట్' గ్రామంలోకి ప్రవేశించవద్దని ముస్లిం ఫకీరులను వారు హెచ్చరించారు.
వీడియోలో, స్థానికులలో ఒకరు ముగ్గురు ముస్లిం ఫకీర్లను దుర్భాషలాడటం, వారి గుర్తింపు వివరాలను అడగడం కనిపిస్తుంది. పండిట్ గ్రామంలోకి ఇంకెప్పుడూ రాకూడదని అతను ముస్లిం ఫకీరులకు హెచ్చరికలు జారీ చేశాడు. ఇక వారితో పదేపదే గుంజిళ్లు తీయిస్తూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయించారు. ఇక జై శ్రీరామ్ నినాదాలు పెద్దగా చెయ్యాలని గద్దించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications