కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు-దీపావళి కానుకగా 3 శాతం డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు దీపావళి వేళ శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యం(డీఏ)ను 3శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. ఉద్యోగులకిచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్ను 3శాతం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంపు ఈ ఏడాది జులై నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 28శాతం ఉండగా.. ఇవాళ కేబినెట్ నిర్ణయంతో అది 31శాతానికి చేరింది.
డీఏ, డీఆర్ ల పెంపుపై కేంద్ర కేబినెట్ ఇవాళ తీసుకున్న నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70కోట్ల మేర అదనపు భారం పడబోతోంది. కరోనా సంక్షోభం దృష్ట్యా గతేడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని ఇవ్వలేదు. దీంతో ఉద్యోగుల నుంచి కేంద్రంపై ఆ మేరకు ఒత్తిడి ఉంది. ఈ ఏడాది కరోనా వ్యాప్తి తగ్గడం, ఆర్ధిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవడతో ప్రభుత్వం డీఏ పెంపుకు ఆమోద ముద్ర వేసింది. ఈ ఏడాది జులై నుంచి డీఏ పెంపును పునరుద్ధరించడమే గాక.. 17శాతం ఉన్న డీఏను 28శాతానికి పెంచారు. ఇప్పుడు మరో 3శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది..
గతేడాది కరోనా ప్రభావం కేంద్ర ప్రభుత్వంతో పాటు అందులో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలపైనా పడింది. ఈ ఏడాది కరోనా వ్యాప్తి తగ్గడంతో ప్రభుత్వం డీఏ పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే కేంద్ర కేబినెట్ ఇవాళ డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకూ ఊరట దక్కింది.