దేశవ్యాప్తంగా ఆ 4 రోజులు టీకా ఉత్సవ్.. నో లాక్ డౌన్, 70శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులే చేయాలి : మోదీ
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ ఉంటుందా అన్న సందేహాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫుల్ స్టాప్ పెట్టారు. కరోనా వైరస్ను ఎదుర్కొనే మౌలిక సదుపాయాలు,వనరులు భారత్కు ఉన్న నేపథ్యంలో దేశంలో మరోసారి లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో కరోనాను ఎదుర్కొనేందుకు తగినన్ని వనరులు,మౌలిక సదుపాయాలు లేని కారణంగా లాక్డౌన్ విధించాల్సి వచ్చిందన్నారు. ఏడాది కాలంగా కరోనాపై పోరాడుతున్నందునా.. ప్రభుత్వ వ్యవస్థల్లో కాస్త నీరసం ఆవహిస్తుందన్న విషయాన్ని తాను అర్థం చేసుకోగలనని అన్నారు. అయితే రాబోయే 2-3వారాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం(ఏప్రిల్ 8) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
మరింత అటెన్షన్ అవసరం : మోదీ
మహారాష్ట్ర,గుజరాత్,ఛత్తీస్గఢ్,పంజాబ్ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది ఆందోళన చెందాల్సిన విషయమని... ముఖ్యంగా చాలామంది ప్రజలు కరోనా వైరస్ను తేలిగ్గా తీసుకుంటున్నారని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పాలనా యంత్రాంగం కూడా అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. కరోనా మొదటి వేవ్ను దేశం అధిగమించిందని... సెకండ్ వేవ్లో మునుపటి కన్నా వేగంగా కేసులు నమోదవుతున్నందునా మరింత అటెన్షన్ అవసరమని పేర్కొన్నారు.
70శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులే చేయాలి : మోదీ
'అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ 19 టెస్టింగ్,ట్రాకింగ్ పెంచాల్సిందిగా కోరుతున్నాను. 70శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులే మన టార్గెట్. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా సరే... వీలైనన్నీ ఎక్కువ టెస్టులు చేయాలి. ప్రధానంగా సరైన పద్దతిలో శాంపిల్స్ సేకరించడం చాలా ముఖ్యమైనది. టెస్ట్,ట్రాక్,ట్రీట్పై ఫోకస్ చేయాలి. పాజిటివిటీ రేటును 5శాతానికి తగ్గించేందుకు కృషి చేయాలి. కరోనాతో మృతి చెందుతున్నవారి డేటాను ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి అన్ని పోర్టల్స్లో అందుబాటులో ఉంచాలి.
దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్...
'ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకూ అన్ని రాష్ట్రాల్లో టీకా ఉత్సవ్ నిర్వహించాలి. వీలైనంత ఎక్కువమంది అర్హులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి. వ్యాక్సిన్ వృథాను తగ్గించాలి. వైరస్ కట్టడిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి. అన్ని రాష్ట్రాలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చించాలి. గవర్నర్లు కూడా ఈ సమావేశంలో భాగస్వామ్యం చేయాలి.రాత్రిపూట కర్ఫ్యూలను కోవిడ్ కర్ఫ్యూలుగా పిలవాలి. మైక్రో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలి. ప్రస్తుతం 45ఏళ్లు నిండినవారికి మాత్రమే ఇస్తున్న వ్యాక్సిన్ను యువతకు కూడా అనుమతించాలని పలు రాష్ట్రాలు కోరినప్పటికీ... ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొన్ని వయసుల వారికే పరిమితం చేయాల్సి ఉంటుందని మోదీ పేర్కొన్నారు.
అవగాహన కల్పించండి : మోదీ
మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం తదితర జాగ్రత్తలపై ప్రజలకు మరోసారి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారు. అంతా కలిసి పనిచేస్తే విజయం మనదేనని అన్నారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్,ఏపీ సీఎం వైఎస్ జగన్,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సహా మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.