జగన్,కేసీఆర్కు మమత లేఖపై మోదీ ఫైర్ -టీఎంసీ కూల్ కూల్ కాదు, పెద్ద శూల్ -బీజేపీకి 200సీట్లు: ప్రధాని
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ వైపు రెండో దశ పోలింగ్ జరుగుతుండగా, మిగతా స్థానాల్లో ప్రచారం హోరెత్తిపోతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దక్షిణ 24 పరగణాల జిల్లా జయనగర్ లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భారీ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై మోదీ నిప్పులు చెరిగారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లతోపాటు బీజేపీ యేతర 15 పార్టీల నేతలకు బెంగాల్ సీఎం లేఖలు రాయడాన్ని ప్రధాని తప్పుపట్టారు. వివరాల్లోకి వెళితే..

కూల్ కూల్ కాదది.. పెద్ద శూల్
బెంగాల్ లో ఈసారి టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో హింస, ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. బీజేపీ ఎంత రెచ్చగొట్టినా ఓటర్లు ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చిన మమతా బెనర్జీ తాజాగా.. ''కూల్ కూల్ తృణమూల్, ఠండా ఠండా కూల్ కూల్, ఓట్ పాబే జోడా ఫూల్'' అని నినాదమిచ్చారు. ఓటర్లంతా ప్రశాంతంగా టీఎంసీ ఎన్నికల గుర్తు రెండు ఆకులుపై ఓటు వేయాలని కోరారు. ఈ పిలుపుపై ప్రధాని మోదీ భారీ సెటైర్లు వేశారు. ''టీఎంసీ కూల్ కూల్ కానేకాదు.. పెద్ద శూల్(శూలం). పదేళ్లుగా జనాన్ని కుళ్లబొడుస్తోన్న శూలమది''అని ఎద్దేవా చేశారు.

దీదీ.. నన్ను తిట్టడండి, కానీ..
''పాపం దీదీకి జైశ్రీరాం నినాదంతో, దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంతో సమస్యలున్నాయి. కొత్తగా తిలకం దిద్దుకున్నవాళ్లపై, కాషాయ వస్త్రాలు ధరించినవాళ్లపైనా ఆమె చిరాకు పడుతున్నారు. రాక్షసులంటూ తిట్టిపోస్తున్నారు. ఎవరినైనా విమ్శించే హక్కు ఆమెకు ఉంది. కానీ నేనొకటి చెబుతాను, దీదీ.. కావాలంటే నన్ను ఇష్టమొచ్చినట్లు తిట్టుకోండి. కానీ ప్రజల దైవిక భావనల్ని అపహాస్యం చేసేలా మాట్లాడితే మాత్రం నేను సహించబోను. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, చైతన్య మహాప్రభుల గుర్తింపుతో బతికే బెంగాలీలను ఒక్క మాటన్నా నేను ఊరుకోను'' అని మోదీ హెచ్చరించారు.

బెంగాల్లో బీజేపీకి 200 ప్లస్..
కూల్ కూల్ నినాదమిస్తోన్న టీఎంసీ నిజానికి శూలంలా జనాల్ని పొడుస్తున్నదని, 82 ఏళ్ల వృద్దురాలు షోవా మజుందార్ పై టీఎంసీ శ్రేణుల హింస గర్హనీయమని, చనిపోయిన ఆ వృద్ధురాలు బెంగాలీ ఆడబిడ్డలకు ప్రతినిధి అని ప్రధాని మోదీ అన్నారు. టీఎంసీ పాలనపై విసుగెత్తిపోయిన జనం మార్పును కోరుకుంటున్నారని, ఈసారి బీజేపీకి 200 పైచిలుకు సీట్లు వస్తాయని, తొలి దశ పోలింగ్ సరళితో ఈ విషయం రూఢీ అయిందని, అందుకే మమతా బెనర్జీలో అసహనం రోజురోజుకూ పెరిగిపోతున్నదని మోదీ అన్నారు. అలాగే..

ప్రతిపక్ష నేతలకు దీదీ లేఖపై..
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కు ఒక్కరోజు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. దేశంలోని బీజేపీయేతర పార్టీల నేతలకు లేఖలు రాశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ తోపాటు మొత్తం 15 మందికి మమత లేఖలు రాశారు. కేంద్రంలో అధికారం వెలగబెడుతోన్న బీజేపీ తీరుతో ఇతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోతున్నాయో ఆ లేఖలో మమత వివరించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై బీజేపీ చేస్తోన్న దాడులను ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజలకు ఓ విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ఆమె నొక్కి చెప్పారు. కాగా, సదరు లేఖలపై ప్రధాని మోదీ అనూహ్యంగా ప్రతిస్పందించారు.

మమతకు బయటి వ్యక్తుల మద్దతా?
''దశల వారీగా పోలింగ్ ముందుకు సాగుతున్నకొద్దీ దీదీలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నది. బెంగాల్ లోని ఆలయాలను దర్శించుకోడానికి వచ్చే బీహార్, యూపీ భక్తులను గుండాలు, బయటి వ్యక్తులంటూ మమత తిట్టిపోస్తున్నది. అలాంటి వ్యక్తి తనకు సాయం చేయండంటూ దేశంలోని ప్రతిపక్ష నేతలకు లేఖలు రాశారు. నాన్ బెంగాలీలు అందరినీ బయటి వ్యక్తులుగా భావించే మమత ఇప్పుడు ఇతర రాష్ట్రాల నేతలకు లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉంది'' అని ప్రధాని మోదీ అన్నారు. గురువారం జరిగిన బెంగాల్ రెండో దశ పోలింగ్ లో మధ్యాహ్నం 3 గంటల వరకే 71.07శాతం ఓటింగ్ నమోదుకావడం గమనార్హం.












Click it and Unblock the Notifications