భబానీపూర్ ఘర్షణ: టీఎంసిపై దాడి ఆరోపణ, ఉప ఎన్నిక వాయిదాకు బీజేపీ డిమాండ్; నివేదిక కోరిన ఈసీఐ
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ భబానీపూర్ ఉప ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎన్నికల వాయిదాకు డిమాండ్ చేశారు. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని భబానీ పూర్ ఘర్షణలపై నివేదిక కోరింది ఎన్నికల కమీషన్.
దిలీప్ ఘోష్ తనపై బీజేపీ నేతలపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణ
తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో భబానీపూర్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై ప్రియాంక టిబ్రేవాల్ ను బిజెపి ఎన్నికల బరిలోకి దింపింది. అయితే తాజాగా భబానీపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ తనతో పాటు ఇతర బిజెపి కార్యకర్తలపై టిఎంసి కార్యకర్తలు ప్రచారం చేస్తున్న సమయంలో దాడి చేశారని ఆరోపించారు.

టీఎంసి కార్యకర్తలు తమను కొట్టారన్న దిలీప్ ఘోష్ , ఎన్నికల వాయిదా డిమాండ్
టీఎంసీ కార్మికులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించినప్పుడు తాను భబానీపూర్లో కరపత్రాలను పంపిణీ చేస్తున్నట్లు ఘోష్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను టీకా కేంద్రంలోకి ప్రవేశించానని, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తనను ఘెరావ్ చేశారని తనపై దాడికి పాల్పడ్డారని, మా కార్యకర్తలను కొట్టడం మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. బిజెపి ఎంపి అర్జున్ సింగ్ విషయంలో కూడా అదే జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భబానీ పూర్ ఉప ఎన్నికను వాయిదా వేయాలని దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు.
ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు, పోలీసులు రక్షణ కల్పించటం లేదని ఆరోపణ
తనపై దాడి చేసిన తర్వాతనే తనను కాపాడే క్రమంలో తన భద్రతా సిబ్బంది ఆయుధాలను తన భద్రతను నిర్ధారించడానికి ఉపయోగించారని దిలీప్ ఘోష్ చెప్పారు. తన జీవితం ప్రమాదంలో ఉందని , అందుకే తన సెక్యూరిటీ అలా ప్రవర్తించవలసి వచ్చిందంటూ దిలీప్ ఘోష్ వెల్లడించారు. ఈసీ భద్రతా చర్యలపై తగిన చర్యలు తీసుకోవాలని, కాని పరిస్థితి ఆ విధంగా లేదని ఆయన పేర్కొన్నారు. ప్రచారంలో ప్రతిరోజూ బిజెపి నేతలపై దాడులు జరుగుతున్నాయని, తాము ఇప్పటికే పోలీసులను సంప్రదించామని కానీ వారు మాకు సహాయం చేయడం లేదన్నారు. మమ్మల్ని రక్షించడానికి ప్రయత్నించిన సివిల్ దుస్తులు ధరించిన ఒక పోలీసు పై కూడా దాడి జరిగిందని దిలీప్ ఘోష్ పేర్కొన్నారు.
భబానీపూర్ ఎన్నికలను వాయిదా వెయ్యండి .. ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్ఞప్తి
ఈ పరిస్థితులలో "స్వేచ్ఛా మరియు న్యాయమైన ఓటింగ్ సాధ్యం కాదు" అని పేర్కొంటూ, పశ్చిమ బెంగాల్ మాజీ బిజెపి చీఫ్ దిలీప్ ఘోష్ భబానీపూర్ ఉప ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) సమాచారం అందించినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఘోష్ విలేకరులతో అన్నారు. ఈ డిమాండ్లతో బిజెపి నేతల ప్రతినిధి బృందం ఎన్నికల సంఘం అధికారులను కలిసినట్లు ఆయన తెలిపారు. తమకు ఎన్నికలలో ప్రచారం చేసే స్వేచ్ఛ కూడా లేనప్పుడు, ఈ ఉప ఎన్నికను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరిన ఎన్నికల కమీషన్
భబానీపూర్ నియోజకవర్గంలో నెలకొన్న గందరగోళాలపై నివేదిక సమర్పించాలని భారత ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది.భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలు, పార్టీ నాయకుడు దిలీప్ ఘోష్ పై ప్రచారం సమయంలో దాడి చేసినట్లు చేసిన ఆరోపణల నేపధ్యంలో నివేదిక కోరింది ఎన్నికల కమీషన్. మరి ఈ వివాదంలో ఏం జరగబోతుందో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications