టీఎన్ పీసీసీ అధ్యక్షుడికి కరోనా వైరస్: ఆసుపత్రిలో చేరిక: ఎన్నికల వేళ..కలకలం
చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. అవి పూర్తిగా సమసిపోవట్లేదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని రాజకీయ పార్టీల కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. కార్యకర్తలతో సమావేశాలు, వరుస భేటీలను నిర్వహిస్తున్నారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు కోసం కసరత్తు చేస్తోన్నారు నేతలు. ఫలితంగా- కరోనా వైరస్ను నివారించడానికి తీసుకుంటోన్న ముందుజాగ్రత్త చర్యల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన.
తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి కరోనా వైరస్ బారిన పడ్డారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని టీఎన్ పీసీసీ అధికారికంగా ధృవీకరించింది. అళగిరి కరోనా వైరస్ బారిన పడినట్లు వెల్లడించింది. ఈ మేరకు కాంగ్రెస్ మీడియా విభాగం ఛైర్మన్ ఏ గోపన్న ఓ ప్రకటన జారీ చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నందున ఆయన తరచూ జిల్లా నాయకులతో సమావేశమౌతున్నారు. కార్యకర్తలను కలుస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన కరోనా బారిన పడి ఉంటారని భావిస్తున్నారు.
ప్రస్తుతం అళగిరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందనక్కర్లేదని పీసీసీ నాయకులు చెప్పారు. ఈ మధ్యకాలంలో అళగిరిని కలిసిన వారు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని గోపన్న సూచించారు. ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. పార్టీ అధ్యక్షుడు త్వరలోనే కరోనా బారి నుంచి కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అళగిరికి కరోనా వైరస్ సోకడం పట్ల డీఎంకే అధినేత, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.