చీలిక దిశగా డిఎంకె?: అళగిరితో ఎంపీలు, మనువడి ఫైర్

ప్రముఖ నటుడు, పెరంబలూర్ ఎంపీ నెపోలియన్, తమిళ నటుడు, రామనాథపురం ఎంపి రితీష్, రాజ్యసభ సభ్యుడు కెపి రామలింగం బుధవారం రాత్రి మదురై వెళ్లి అళగిరితో భేటీ అయ్యారు. గంటపాటు మంతనాలు జరిపారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తమ నేత అళగిరి చెప్పిన దానికి తాము కట్టుబడి ఉంటామని ప్రకటించారు.
కరుణానిధి మంగళవారం ఇచ్చిన ప్రకటన నుంచి తానింకా కోలుకోలేదని ఈ సందర్భంగా అళగిరి వ్యాఖ్యానించారు. అభాండాలు వేశాక ఇప్పుడు సామరస్యం కోసం రాయబారం పంపితే ఎలా అని మండిపడ్డారు. తప్పులు చేసిన వారే భయపడతారని, తనకు తన మద్దతుదారుల అండ ఉంటుందని చెప్పారు. అళగిరి తనయుడు కూడా తాత కరుణానిధి పైన ఆగ్రహం వ్యక్తం చేశారట.
కాగా నెపోలియన్ బంధువైన డిఎంకె సీనియర్ నేత, మాజీ మంత్రి కెఎన్ నెహ్రూ కూడా అళగిరి బృందంతోనే జత కట్టవచ్చునని అంటున్నారు. గురువారం జరుగనున్న అళగిరి జన్మదినాన ఆయన మద్దతుదారులంతా మదురై బయలుదేరి వెళ్లనున్నారు.
మరోవైపు, సోదరుల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అంబజగన్ ఆచితూచి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు అళగిరి దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారని వార్తలు వస్తున్నాయని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఎంతోకాలంగా పార్టీ అనుసరిస్తున్న క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications