నేతాజీపై నిజాలు త్వరలో, ఆ ఫైళ్లూ బయటపెట్టండి: మమతా బెనర్జీ
కోల్కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతికి సంబంధించిన నిజానిజాలు త్వరలోనే నెలుగులోకి వస్తాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం నాడు వ్యాఖ్యానించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన 12,744 పేజీలతో కూడిన 64 దస్త్రాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు.
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ మృతికి సంబంధించిన నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నేతాజీ దస్త్రాలను తమ ప్రభుత్వం బహిర్గతం చేసిందని చెప్పారు.

కేంద్రం కూడా వెంటనే తమ వద్ద ఉన్న దస్త్రాలను బహిర్గతం చేసి నేతాజీకి సంబంధించిన విషయాలు దేశ ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. నేతాజీ మరణించడం దురదృష్టకరమే అయినా 70 ఏళ్లుగా ఆయన మృతి రహస్యంగా మిగిలిపోయిందన్నారు.
వాస్తవాలు ఎంతో కాలం దాగి ఉండలేవని చెప్పారు. త్వరలోనే ఆయన మృతికి గల కారణాలు పూర్తిగా తెలుస్తాయన్నారు. నేతాజీ లాంటి స్వాత్రంత్య సమరయోధుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే హక్కు ప్రతి భారత పౌరుడికి ఉందని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో నేతాజీ కుటుంబం పైన స్నూపింగ్ బాధాకరమని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. నేతాజీ కుటుంబం చాలా ఏళ్ల పాటు స్నూపింగ్ ఎదుర్కొందని, ఇది బాధాకరం అన్నారు. నేతాజీ భారత దేశం యొక్క గొప్ప బిడ్డ అన్నారు. నేతాజీ దేశానికి చేసిన సేవకు తగ్గ గౌరవం దక్కలేదన్నారు.












Click it and Unblock the Notifications