గాంధీ హత్యలో గాడ్సేకు సావర్కర్ సాయం-బాల్ థాక్రే తండి వార్నింగ్-తుషార్ గాంధీ కామెంట్స్
బీజేపీ భావజాలకర్త వీర్ సావర్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సావర్కర్ స్వాతంత్రోద్యమంలో భారతీయులకు వ్యతిరేకంగా బ్రిటీష్ వారికి క్షమాపణ అడిగిన లేఖను బయటపెట్టారు. ఇప్పుడు గాంధీజీ మునిమనుమడు తుషార్ గాంధీ మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. అదే సమయంలో శివసేన వ్యవస్ధాపకుడు బాల్ థాక్రే తండి గాంధీని గతంలో కాపాడారనన్నారు.
గాంధీపై హత్యా ప్రయత్నాలు
1930లలో గాంధీని చంపేందుకు అనేక ప్రయత్నాలు జరిగినట్లు ఆయన మునిమనుమడు, సామాజిక కార్యకర్త తుషార్ గాంధీ వెల్లడించారు. దీని వెనుక ఎవరున్నారు, వారి పాత్ర ఏంటి, వాటి నుంచి గాంధీని కాపాడింది ఎవరనే అంశాలపై తుషార్ గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. స్వాతంత్రోద్యమ సమయంలో ఏం జరిగిందనే దానికి తుషార్ వ్యాఖ్యలు అద్దం పట్టేలా ఉన్నాయి.
గాంధీని కాపాడిన బాల్ థాక్రే తండి
1930లో విదర్భలోని అకోలాలో గాంధీజీని చంపడానికి కుట్ర పన్నినట్లు తుషార్ గాంధీ తెలిపారు. ఈ విషయాన్ని శివసేన వ్యవస్ధాపకుడు బాల్ థాక్రే తండ్రి ప్రబోధంకర్ ఠాక్రే గాంధీ సహచరులకు ముందే హెచ్చరించి ఆయన ప్రాణాలను కాపాడారని తుషార్ తెలిపారు. ఆ తర్వాత ఆయన సనాతన హిందూ సంస్థలకు బహిరంగ హెచ్చరిక జారీ చేశారన్నారు.అప్పట్లో గాంధీపై జరిగిన పలు హత్యాయత్నాల నుంచి ఆయన తప్పించుకున్నారని తుషార్ తెలిపారు.
గాడ్సేకు గన్ వెతికిపెట్టిన సావర్కర్
ఈ దేశానికి స్వాతంత్ర్యం అందించిన తన ముత్తాత మహాత్మాగాంధీని హత్య చేసేందుకు తగిన గన్ వెతికిపెట్టడంలో హంతకుడు నాథూరాం గాడ్సేకు వీర్ సావర్కర్ సాయం చేశాడని తుషార్ గాంధీ సంచలన ఆరోపణ చేశారు. గాంధీని చంపేందుకు ఎలాంటి గన్ అయితే సరిపోతుందో అలాంటి గన్ ను సావర్కర్ గాడ్సేకు వెతికి పెట్టారన్నారు. సావర్కర్ బ్రిటీష్ వారికి సాయం చేయడమే కాదు వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న గాంధీని అంతమొందించేందుకు తగిన గన్ కూడా వెతికిపెట్టారన్నారు. ఈ సందర్భంగా తుషార్ గాంధీ సనాతన హిందువుల నాయకులు సావర్కర్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్లను విమర్శించారు.
తుషార్ ఆరోపణల్ని ఖండించిన బీజేపీ
తుషార్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ పేర్కొంది. గాంధీజీ హత్య కేసులో కోర్టు గాడ్సేకు ఉరిశిక్ష విధించి అమలు చేసిందని, ఇప్పుడు కొందరు వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం సావర్కర్ ను ఇందులోకి లాగుతున్నారని, తద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మహారాష్ట్ర బీజేపీ నేతలు విమర్శించారు. సావర్కర్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్రలో వివాదం నెలకొన్న నేపథ్యంలో తుషార్ గాంధీ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.