Kappa variant: కరోనా కొత్త మ్యూటెంట్: ఆ రాష్ట్రంలో ఒకరు బలి: ట్రావెల్ హిస్టరీ లేకున్నా
లక్నో: ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకూ తన రూపాన్ని మార్చుకుంటోంది. కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. ఇదివరకు బ్రిటన్ వేరియంట్.. ఆ తరువాత డెల్టా ప్లస్ మ్యూటెంట్తో ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురి చేస్తోన్న ఈ మహమ్మారి.. మరో కొత్త అవతారం ఎత్తింది..మరింత భయానకంగా తయారవుతోంది. తాజాగా- కప్పా వేరియంట్ (Kappa variant) రూపాన్ని సంతరించుకుందా మహమ్మారి. భారత్లో రెండు కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ వైరస్ బాధితుల్లో ఒకరు మరణించారు కూడా. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కప్పా వేరియంట్ కరోనా వైరస్ సోకడంతో ఇద్దరు పేషెంట్లు ఆసుపత్రిలో చేరినట్లు లక్నోలోని కింగ్ జార్జ్ వైద్య కళాశాల, ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు ఓ బులెటిన్ విడుదల చేశారు. వైరస్ జీనోమ్ సీక్వెన్స్ను పరీక్షించిన తరువాత దీన్ని ధృవీకరించినట్లు చెప్పారు. ఇప్పటిదాకా వెలుగులోకి రాని కొత్త మ్యూటెంట్గా వైరస్ ఆవిర్భవించినట్లు గుర్తించామని అన్నారు. సాధారణ కరోనా వైరస్ వ్యాప్తితో పోల్చుకుంటే.. దీని వేగం మరింత అధికంగా ఉంటుందని చెప్పారు.

కప్పా వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు తెలియజేసినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ తరహా వేరియంట్ కేసులు మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చామని చెప్పారు. లక్నోలని సంత్ కబీర్ నగర్లో నివసించే 66 సంవత్సరాల వయస్సున్న ఓ వృద్ధుడికి కప్పా వేరియంట్ కరోనా వైరస్ సోకినట్లు గుర్తించామని, ఆ తరువాత కొద్దిరోజులకు అతను మరణించినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. మే 27వ తేదీన అతనికి వైరస్ సోకగా.. జూన్ 14న మృతిచెందినట్లు చెప్పారు.
23 సంవత్సరాలు ఉన్న మరో యువకుడిలో ఇవే లక్షణాలు కనిపించాయని, ప్రస్తుతం అతను గోరఖ్పూర్లోని బాబా రాఘవ్దాస్ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అతనికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని చెప్పారు. రాష్ట్రంలో వందకు పైగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి కప్పా వేరియంట్ పాజిటివ్ కేసులు ఈ రెండు మాత్రమే నమోదయ్యాయయని చెప్పారు. మరికొన్ని శాంపిళ్లకు సంబంధించిన ఫలితాలు తెలియాల్సి ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications