గుజరాత్ లో బ్రిటన్ ప్రధాని-బుల్ డోజర్ల యూనిట్ ప్రారంభించి-సబర్మతిని దర్శించి-అదానీతో భేటీ
భారత్ లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ పర్యటన ప్రారంభమైంది. రెండురోజుల టూర్ కోసం భారత్ వచ్చిన జాన్సన్ ముందుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడ సబర్మతీ ఆశ్రమానికి వెళ్లిన ఆయన.. అనంతరం స్ధానిక బుల్ డోజర్ల కంపెనీని సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం పారిశ్రామికవేత్త గౌతం అదానీతో భేటీ అయ్యారు. బోరిస్ జాన్సస్ వెంట పలువురు ప్రముఖులు ఉన్నారు.

బోరిస్ జాన్సస్ భారత్ టూర్
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ తొలిసారి భారత్ లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన ఆయన తొలిసారిగా ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి అహ్మదాబాద్లోని ఒక హోటల్ వరకు నాలుగు కి.మీ మార్గంలో వాద్య,నృత్యకారులు, సంగీత విద్వాంసులతో ఘన స్వాగతం లభించింది.

సబర్మతీ ఆశ్రమంలో బోరిస్ జాన్సన్
గుజరాత్ పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ అహ్మదాబాద్లో మహాత్మా గాంధీ జీవించిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ జాన్సస్ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించిన మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఆశ్రమంలో మహాత్ముడు వాడిన చరఖా తిప్పారు. మహాత్ముడి గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సబర్మతీ ఆశ్రమంలో దాదాపు 30 నిమిషాలు గడిపిన బోరిస్ జాన్సస్ ఆ తర్వాత బయలుదేరారు.

బుల్ డోజర్ల యూనిట్ ప్రారంభించిన బ్రిటన్ ప్రధాన్
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన రెండు రోజుల భారత పర్యటనలో జేసీబీ ఫ్యాక్టరీని ప్రారంభించారు. యూకేకు చెందిన జోసెఫ్ సిరిల్ బామ్ఫోర్డ్ ఎక్స్కవేటర్స్ లిమిటెడ్ కంపెనీ కొత్త ప్లాంట్ను ఆయన ఇవాళ గుజరాత్ లో ప్రారంభించారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రత్యర్ధుల్ని అణచివేసేందుకు బుల్ డోజర్లను బీజేపీ ప్రభుత్వాలు, నేతలు ప్రయోగిస్తున్న నేపథ్యంలో బోరిస్ జాన్సస్ బుల్ డోజర్ల యూనిట్ ప్రారంభించడం విశేషం. ఢిల్లీలోని జహంగీర్ పురీ సహా పలు చోట్ల జేసీబీలతో బీజేపీ నేతలు కూల్చివేతలకు దిగుతున్న నేపథ్యంలో ఈ కొత్త యూనిట్ ప్రారంభం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
అదానీతో బోరిస్ జాన్సస్ భేటీ
గుజరాత్ పర్యటనలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ బిలియనీర్, పారిశ్రామికవేత్త గౌతం అదానీతో భేటీ అయ్యారు. వాతావరణమార్పుల విషయంలో భారతీయ కంపెనీలు బ్రిటన్ తో కలిసి పనిచేసే అంశంపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే పునరుత్పాదక శక్తి, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లోనూ కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై బోరిస్ జాన్సన్ తో చర్చించినట్లు అదానీ స్వయంగా ట్వీట్ చేసారు. గుజరాత్ కు వచ్చిన తొలి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అంటూ అదానీ తన ట్వీట్ లో ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications