గోవా ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమోద్ సావంత్: ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు బీజేపీ సీనియర్ నేత ప్రమోద్ సావంత్. ఈ మేరకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.
"శాసనసభా పక్ష నాయకుడిగా ప్రమోద్ సావంత్ పేరును విశ్వజిత్ రాణే ప్రతిపాదించారు. అందరూ సావంత్ను ఏకగ్రీవంగా నాయకుడిగా ఎన్నుకున్నారు. వచ్చే ఐదేళ్లపాటు ఆయనే శాసనసభా పక్ష నేతగా ఉంటారు" అని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు.
40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో మెజారిటీ మార్కుకు ఒక్క స్థానం తక్కువగా అంటే 20 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అయితే, ఆ పార్టీకి MGPకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యుల మద్దతును పొందింది. ఈ క్రమంలోనే గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.
ఉత్తరాఖండ్ సీఎంగా మరోసారి పుష్కర్ సింగ్ ధామి
పుష్కర్ సింగ్ ధామి మరోసారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. సోమవారం బీజేపీ ఉత్తరాఖండ్ శాసనసభ పక్ష నేతగా ధామి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో మార్చి 23న పుష్కర్ సింగ్ ధామి రెండోసారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ పరిణామాన్ని ధృవీకరించారు రక్షణ మంత్రి, ఉత్తరాఖండ్ బిజెపి కేంద్ర పరిశీలకుడు రాజ్నాథ్ సింగ్. "పుష్కర్ సింగ్ ధామి శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. నేను ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను, అతని నాయకత్వంలో ఉత్తరాఖండ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని నేను విశ్వసిస్తున్నాను' అని రాజ్నాథ్ అన్నారు.
ఉత్తరాఖండ్కు బీజేపీ కేంద్ర పరిశీలకులు రాజ్నాథ్ సింగ్, మీనాక్షి లేఖి, రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రహ్లాద్ జోషి హాజరైన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ధామి పేరు ఖరారు చేశారు. కాగా, ధామీతో పాటు చౌబత్తఖాల్ ఎమ్మెల్యే సత్పాల్ మహరాజ్, శ్రీనగర్ ఎమ్మెల్యే ధన్ సింగ్ రావత్, రాజ్యసభ ఎంపీ అనిల్ బలూనీలు ఈ అత్యున్నత పదవికి పోటీ పడుతున్న వారిలో ఉన్నారు.
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి, వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఉదంసింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా స్థానంలో పుష్కర్ సింగ్ ధామి ఓటమి పాలయ్యారు.
ఖతిమా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6,579 ఓట్ల తేడాతో ఓడిపోయిన పుష్కర్ సింగ్ ధామి మార్చి 11న ఉత్తరాఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు.