UNION BUDGET 2020-2021 .. ఏప్రిల్ నుండి కొత్త జీఎస్టీ విధానం ..జనవరిలో రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ
Recommended Video
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు . ఇక ఈ బడ్జెట్ లో జీఎస్టీ వసూళ్ళ గురించి ప్రసంగించారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానం మంచి ఫలితాన్నిచ్చిందని నిర్మాలా సీతారామన్ పేర్కొన్నారు. జీఎస్టీ ద్వారా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్నారు . ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ విధానం అమలు చేస్తామన్నారు. అలాగే ప్రజలపై దాదాపు పది శాతం వరకూ పన్నుభారం తగ్గిందన్నారు.

40 కోట్ల మంది జీఎస్టీ రిటర్న్ ఫైల్
జీఎస్టీ వల్ల గత రెండేళ్లలో కొత్తగా 16లక్షల మంది పన్ను చెల్లింపు దారులు పెరిగారని వివరించారు. 40 కోట్ల మంది పన్ను రిటర్న్ ఫైల్ చేశారని చెప్పారు. ఈ ఏడాది నుంచి జీఎస్టీ రిటర్న్స్ మరింత సులభతరం అయిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ పన్ను ఆదాయం పెరిగే అవకాశం ఉందని నిన్న ఆర్థిక సర్వేలో పేర్కొన్న విషయం తెలిసిందే . ఇక వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూలు జనవరిలో రూ 1.1 లక్షల కోట్లు దాటాయని అధికార వర్గాలు తెలిపాయి. 2019 జనవరిలో ఆదాయంతో పోలిస్తే..ఈ ఏడాది జనవరి ఆదాయం 12 శాతం వృద్ధిని కనబరిచినట్లు తెలుస్తోంది.

జనవరి నెలలో 1 లక్ష కోట్లు దాటిన ఆదాయం
జూలై 2017 లో జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత నెలవారీ ఆదాయం రూ 1 లక్ష కోట్లు దాటడం ఇది రెండోసారి. ఈ నెల ప్రారంభంలో సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే నిర్దేశించిన లక్ష్యానికి అనుకూలంగా వసూళ్లు ఉన్నాయి. జనవరి నెలలో దేశీయ జీఎస్టీ వసూలు రూ .86,453 కోట్లు కాగా, ఐజిఎస్టి, సెస్ కలెక్షన్ ద్వారా రూ .23,597 కోట్లు వసూలు చేశారు.

జనవరి 30 నాటికి మొత్తం 82.8 లక్షల జీఎస్టీఆర్ 3బీ రిటర్నులు దాఖలు
డిసెంబరులో జీఎస్టీ ఆదాయం మొత్తం రూ 1.03 లక్షల కోట్లు ఉంది. జనవరి 30 నాటికి మొత్తం 82.8 లక్షల జీఎస్టీఆర్ 3బీ రిటర్నులు దాఖలైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పటివరకు జనవరి నెలల్లో వసూలైన జీఎస్టీ వివరాలు చూస్తే సెంట్రల్ జీఎస్టీ రూ.20,944 కోట్ల రూపాయలు కాగా , స్టేట్స్ జీఎస్టీ రూ.28,224 కోట్లు, సమీకృత జీఎస్టీ రూ.53,013 కోట్లు, సెస్ రూ.8,637 కోట్లు మొత్తం రూ.1,10,828 కోట్లుగా ఉంది












Click it and Unblock the Notifications