UNION BUDGET 2020- 2021 ..నేడే కేంద్ర బడ్జెట్ .. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా నిర్మలా
Recommended Video
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్సభలో తెలుగింటి కోడలు నిర్మల బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే దేశం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు ఆర్ధిక లోటు నుండి బయటపడాలని కేంద్ర బడ్జెట్ పై ఆశగా ఎదురు చూస్తున్నాయి. కానీ ఈ బడ్జెట్పై ఎక్కువ అంచనాలు వద్దనే సంకేతాల్ని నిన్న ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ద్వారా నిర్మలా సీతారామన్ చెప్పేశారు.
UNION BUDGET 2020- 2021 ..ఈ సారైనా ఆర్ధిక కష్టాల నుండి ఏపీ గట్టేక్కేలా కేంద్రం కరుణిస్తుందా.. ?
ఆర్ధిక మందగమనం నుంచీ దేశాన్ని బయటపడేసేలా బడ్జెట్ ఉండనుందా
వృద్ధి రేటు లక్ష్యాన్ని 5 నుంచి 6 శాతానికే పరిమితం చేయడం ద్వారా ఈ రోజు బడ్జెట్ వాస్తవ పరిస్థితులను బట్టి ఉంటుందని తేటతెల్లం చేశారు నిర్మలా సీతారామన్ . ఇక దేశం మొత్తం ఆర్ధిక ఒడిదుడుకుల మధ్య ఉన్న నేపధ్యంలో ఇవాళ్టి బడ్జెట్పై మరీ ఎక్కువ ఆశలు పెట్టుకుంటే నిరాశ తప్పదు అని నిన్ననే ఆమె చెప్పకనే చెప్పారు . దేశ పరిస్థితి ఆర్ధిక మందగమనంలో ఉన్న కారణంగా ఈ మందగమనం నుంచీ దేశాన్ని బయటపడేసేలా బడ్జెట్ ఉండాలని అందరూ భావిస్తున్నారు. కానీ అలాంటి పరిస్థితి ఉంటుందో లేదో చూడాల్సి ఉంది .
ఆర్ధిక ఒడిదుడుకులతో దేశం కుదేలు .. అన్ని రంగాలపై ప్రభావం
గత కేంద్ర సర్కార్ తీసుకున్న పాత నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి ఇప్పటికీ దేశ ఆర్ధిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తున్నాయి. వాటివల్లే వివిధ రంగాలు దెబ్బతిన్నాయన్న విమర్శలున్నాయి. దానికి తోడు పారిశ్రామిక మందగమనం , దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం , నిత్యవసర ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండటం వంటి కారణాలు కూడా దేశాన్ని ఆర్ధిక ప్రగతి వైపు నడిపించాలేకపోతున్నాయి. ఇక రైల్వే ప్రాజెక్టులపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ డిమాండ్లు ఉన్నా అవి నేరవేరే పరిస్థితులు ఇప్పుడు కనపడటం లేదు .
జీఎస్టీ పేరుతో కేంద్రం అడ్డంగా పన్నులు..దెబ్బ తిన్న పారిశ్రామిక రంగం
ఇక అంతే కాదు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలులోకి వచ్చిన నాటి నుండి జీఎస్టీ పేరుతో కేంద్రం అడ్డంగా పన్నులు బాదేస్తోందనే వాదన ఉంది. ఫలితంగా ప్రజలపై విపరీతమైన భారం పడుతోంది. పరిశ్రమల్లో ఉత్పత్తి వేగంతగ్గటం, కొనుగోళ్ళు లేకపోవటం, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలు బాగా దెబ్బ తినటం , వ్యవసాయం లాభసాటిగా లేకపోవటం వంటి అనేక కారణాలు మన ఆర్ధిక ప్రగతికి విఘాతం కలిగిస్తున్నాయి.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా బడ్జెట్
ఈసారి బడ్జెట్లో అన్ని రాష్ట్రాలు ఊహించిన మేరకు కేటాయింపులు ఉండబోవని తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండబోతోందని తెలిసింది. గత బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపును రూ.5 లక్షల వార్షిక ఆదాయం వరకూ పెంచిన కేంద్ర ప్రభుత్వం, ఈసారి దాన్ని రూ.7 లక్షలకు పెంచుతుందనే అంచనాలున్నాయి. అదే జరిగితే మధ్య తరగతి ప్రజలకు కొంత మేర ఊరట . ఏది ఏమైనా ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వస్తున్న బడ్జెట్ గా మాత్రమే దీనిని చూడాల్సి ఉంది . మరి ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఆర్ధిక పురోగతి కోసం నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కీలకంగా మారనుంది. పెద్దగా ఆశలు పెట్టుకుంటే నిరాశ తప్పదని చెప్తోంది .