జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకూ పార్లమెంటు సమావేశాలు- ఫిబ్రవరి 1న కేంద్ర బడ్డెట్
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ కోసం పార్లమెంటు ఈ నెల 29న సమావేశం కానుంది. ఈ నెల 29న ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 15 వరకూ కొనసాగబోతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో పలు జాగ్రత్తలతో ఈ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇవాళ ప్రకటించింది.
జనవరి 29న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. అనంతరం పార్లమెంటు వాయిదా పడుతుంది. అనంతరం 31న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. తర్వాత ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెటులో ప్రవేశపెడతారు. అనంతరం సభ మరోసారి వాయిదా పడుతుంది. వారం రోజుల వ్యవధి తర్వాత పార్లమెంటు రెండో దశ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 8న ప్రారంభమవుతాయి. వారం రోజుల పాటు సాగే సమావేశాలు ఫిబ్రవరి 15తో ముగుస్తాయి.

కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు. అంతకుముంది వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులకూ కరోనా సోకింది. దీంతో సమావేశాలను అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సమావేశాలు జరగలేదు. ఈ నెల 29న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో విపక్షాలు రైతు నిరసలపై కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో పార్లమెంటు సమావేశాలకు ముందు జరిపే అఖిలపక్ష భేటీపై ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications