అమిత్ షా విమానం దారి మళ్లింపు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండైంది. త్రిపుర రాజధాని అగర్తలలోని మహారాజా బిర్ బిక్రమ్ విమానాశ్రయంలో ఇది ల్యాండ్ కావాల్సింది. అయితే, దట్టమైన పొగమంచు కారణంగా దారి మళ్లించారు. అనంతరం గౌహతిలోని లోక్ప్రియ గోపినాథ్ బోర్డోలాయ్ విమానాశ్రయంలో క్షేమంగా దిగింది.
ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం.. అమిత్ షా బుధవారం రాత్రి అగర్తల వెళ్లాల్సి ఉంది. రాత్రి పది గంటలకు ఆయన మహారాజా విమానాశ్రయానికి చేరుకోవాలనుకున్నారని, అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వడంతో దట్టమైన పొగమంచు కారణంగా అది సాధ్యపడలేదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ ఏడాదిలో త్రిపుర ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారంలో భాగంగా గురువారం రెండు రథయాత్రలను అమిత్ షా ప్రారంభించాల్సి ఉండగా కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
దేశ రాజధాని న్యూఢిల్లీ చలి గుప్పిట్లో చిక్కుకుంది. గురువారం ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోయాయి. ఈ సీజన్లో ఉష్ణోగ్రత అత్యల్పంగా మూడు డిగ్రీలకు తగ్గిపోవడంతో రాజధాని వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. పొగమంచు కారణంగా ఎదురుగా ఏమి వస్తున్నాయో కనపడకపోవడంతో వాహనదారులు కూడా తమ వాహనాలను బయటకు తీయలేదు. మరో వారంరోజులపాటు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పొగమంచుతోపాటు కాలుష్యం గుప్పిట చిక్కుకున్న తమను కాపాడేవాడు లేడా? అంటూ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.