న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలు - ఎవరు నియంత్రించాలి: కేంద్ర మంత్రి సంచలనం..!!
కేంద్ర న్యాయమంత్రి కిరెన్ రిజిజు న్యాయవ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు న్యాయవ్యవస్థలో ఉండే రాజకీయాల గురించి తెలియదని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులు ఎక్కువ సమయం తదుపరి జడ్జిగా ఎవరిని నిర్ణయించాలనే అంశం పైనే కేటాయిస్తారని కీలక వ్యాఖ్య చేసారు. భారతదేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడా జడ్జిలే జడ్జిలను నియమించుకునే సంప్రదాయం లేదని చెప్పుకొచ్చారు. రాజ్యంగంలో పొందపరిచిన అంశాల ప్రాతిపదికన చూసినా.. జడ్జిలను నియమించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసారు.
ఈ అంశం పైనే ఎక్కువగా న్యాయమూర్తులు ఆలోచన చేయటం వలన న్యాయం అందించే ప్రక్రియకు విఘాతం కలిగిస్తోందని కేంద్ర మంత్రి వివరించారు. ప్రజాస్వామ్యంలో మూడు స్థంభాలుగా నిలిచే కార్యనిర్వహక.. శాసన వ్యవస్థలను మూడోది..కీలకమైన న్యాయవస్థ నియంత్రిస్తుందన్నారు. కానీ, న్యాయవ్యవస్థ దారితప్పితే దాన్ని నియంత్రించడానికి ఏ యంత్రాంగమూ లేదంటూ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసారు. న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థపై ప్రజలు సంతోషంగా లేరన్నారు. ఆర్ఎస్ఎస్ వారపత్రిక పాంచజన్య నిర్వహించిన సబర్మతి సంవాద్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరెన్ రిజుజు ఈ వ్యాఖ్యలు చేసారు.
మనదేశంలో 1993 వరకూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన మీదట జడ్జీలను న్యాయశాఖ మంత్రే నియమించేవారని గుర్తు చేశారు. అందుకే అప్పట్లో ఉద్ధండులైన జడ్జీలు ఉండేవారన్నారు. న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థపై ప్రజలు సంతోషంగా లేరన్నారు. కొలీజియం విధానంలో జడ్జీలను నియమించే సమయంలో చాలా తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతుంటాయని..ఆ పరిస్థితులు ఒక విధంగా న్యాయవ్యవస్థ లో గ్రూపులుగా ఏర్పడటానికి కారణమవుతోందని చెప్పటానికి తాను చింతిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. కేసులు విచారణ సందర్భంగా కొందరు జడ్జీలు చేసే వ్యాఖ్యలు తీర్పుల్లో ఉండవని గుర్తుచేశారు. విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసే సమయాల్లో సంయమనం పాటించాలని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపినప్పుడు వారికి తాను ఈ విషయంలో ఒక సూచన చేశానని.. వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటూ విజ్ఞప్తి చేశానని వివరించారు.