కరోనా ఉన్నా సరే .. ప్రైవేటీకరణ, మారటోరియంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ షాకింగ్ కామెంట్స్
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా రెండవ దశ అత్యంత తీవ్రంగా కొనసాగుతూ భారతదేశంలో దారుణ పరిస్థితులకు కారణం అవుతుంది . ఇక ఈ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక స్థితి కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మలా సీతారామన్ ఇదే సమయంలో పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు.
కరోనా సెకండ్ వేవ్ : మేలో ఉగ్రరూపం దాల్చనున్న కరోనా , హెల్త్ ఎమర్జెన్సీలో దేశం !!
ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన నిర్మలా సీతారామన్
కరోనా కష్టకాలంలో కూడా బడ్జెట్లో ప్రకటించిన సంస్కరణలు , పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలనే నిర్ణయం మార్చుకోబోమని, ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఇదివరకు చెప్పినట్లుగానే ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ఆర్ధిక వ్యవస్థ తెరిచే ఉందన్న కేంద్ర మంత్రి , బడ్జెట్ నిర్ణయాల కొనసాగింపుపై కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం అక్కడక్కడా లాక్ డౌన్ లు కొనసాగుతూనే ఉన్నా ఆర్థిక వ్యవస్థ తెరిచే ఉందని పేర్కొన్నారు. బడ్జెట్ లో తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తామని వెల్లడించిన ఆమె పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు సంబంధించి, సంబంధిత కార్యక్రమాలన్నీ సజావుగా కొనసాగుతున్నట్లుగా వెల్లడించారు. దేశంలో అక్కడక్కడా లాక్ డౌన్ లు ప్రకటించినా అవి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పై ,వ్యవస్థాగత సంస్కరణలపై ప్రభావం చూపబోవని భావిస్తున్నామని నిర్మల సీతారామన్ వెల్లడించారు.
మరోమారు మారటోరియం ప్రకటించే ఆలోచన లేదని చెప్పిన నిర్మలా సీతారామన్
ఇదే సమయంలో మరోమారు మారటోరియం ప్రకటన చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు .ఎందుకంటే దేశంలో ఆర్థిక వ్యవస్థ కొనసాగుతోందని మారటోరియం విధించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మహమ్మారి పంజా విసురుతున్న ఈ సమయంలో తలెత్తిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాయని, పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నామని, ప్రస్తుతం దేశంలో ప్రజల ఆరోగ్య రక్షణ, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై దృష్టి సారించామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఆరోగ్య సంక్షోభం నుండి బయటపడితే ఆర్ధిక వ్యవస్థపై దృష్టి పెడతామన్న కేంద్ర మంత్రి
ప్రస్తుతం రోజు వారి ఆర్థిక వ్యవస్థను చాలా సూక్ష్మంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్న నిర్మలాసీతారామన్, దేశ ఆర్థిక వ్యవస్థ కుంటు పడకుండా తగిన విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఆరోగ్య సంక్షోభం నుంచి బయటపడితే, ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలన్న దానిపై దృష్టి సారిస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్. ప్రస్తుతం ఇండస్ట్రీలు రికవరీ మోడ్ లో ఉన్నాయని వెల్లడించిన ఆమె కరోనా సెకండ్ వేవ్ కారణంగా బడ్జెట్లో తీసుకున్న సంస్కరణలు ప్రభావితం కావని మరోమారు తేల్చి చెప్పారు.
సంస్కరణలు ఆగవు .. పెట్టుబడుల ఉపసంహరణకు బ్రేక్ ఇచ్చేది లేదు
ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ , పలు బ్యాంకులు , పలు పోర్టులు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ తో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కొంతకాలం పాటు వాయిదా వేస్తుందేమో అని అంతా భావించారు . కానీ సర్కార్ మాత్రం కరోనా పంజా విసురుతున్నా సరే ఆర్ధిక సంస్కరణలు ఆగవని , పెట్టుబడుల ఉపసంహరణకు బ్రేక్ ఇచ్చేది లేదని చెప్పటం గమనార్హం .