కేంద్ర మంత్రి సరేశ్ కు కరోనా - ఇంకో మూడు రోజుల్లో పార్లమెంట్ భేటీ అనగా..
మరో మూడు రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానుండగా.. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అంగడి సురేశ్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. సభకు రావడానికి 72 గంటల ముందే అందరూ విధిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఆదేశించడం తెలిసిందే. తనకు కరోనా సోకిన విషయాన్ని మంత్రి స్వయంగా వెల్లడించారు.
''శుక్రవారం కరోనా టెస్టులు చేయించుకున్నాను. కొవిడ్-19 పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. అయితే, నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. డాక్టర్ల సలహాలు తీసుకుంటున్నాను. గడిచిన కొద్ది రోజులుగా నన్ను కలిసినవాళ్లందరూ విధిగా టెస్టులు చేయించుకోవాలని, అవసరమైతే క్వారంటైన్ లో ఉండాలని కోరుతున్నా'' అని మంత్రి సురేశ్ ట్వీట్ చేశారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 14 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాలకు కనీవినీ ఎరుగని స్థాయిలో జాగ్రత్త చర్యలు చేపట్టారు. సభ్యులు, సిబ్బంది అంతా 72 గంటల ముందే కరోనా టెస్టులు చేయించుకోవడాన్ని తప్పనిసరి చేశారు. భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు చేయడంతో ఉదయం రాజ్యసభ, మధ్యాహ్నం లోక్ సభను నాలుగేసి గంటల చొప్పున నిర్వహిస్తారు. సమావేశాల ప్రారంభ గడువు దగ్గర పడుతుండటంతో మంత్రులు, ఎంపీలు, సిబ్బంది తమ ఆరోగ్యాలపై మరింత శ్రద్ధవహిస్తున్నారు.
కరోనా కొత్త కేసులకు సంబంధించి భారత్ లో ఇవాళ ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,550 కేసులు, 1209 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45.65 లక్షలకు, మరణాల సంఖ్య 76,271కి పెరిగింది.












Click it and Unblock the Notifications